తెలుగుదేశం రాజకీయాలు ఎన్నికల వేళ రోడ్డున పడటం కొనసాగుతూ ఉంది. అపరచాణుక్యుడు అంటూ ఆస్థాన మీడియా చేత నిత్యం కితాబులు అందుకునే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటిస్తే... సొంత పార్టీలోనే రచ్చలు రేగాయి! అనేక చోట్ల తెలుగుదేశం ఆఫీసుల మీద పచ్చచొక్కాలే దాడులకు దిగాయి. కొన్ని చోట్ల అయితే ఒక రోజున నియోజకవర్గ ప్రధాన కార్యాలయం, మరుసటి రోజున మండల కేంద్రం ఆఫీసు మీద.. ఇలా దశల వారీగా దాడులు చేస్తూ టికెట్ దక్కని వారు నిరసన ప్రదర్శనలు చేశారు! అలాంటి వాటిల్లో మడకశిర నియోజకవర్గం ఇది.
కర్ణాటక బోర్డర్ లోని ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున ముందుగా సునీల్ కుమార్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే పక్షం రోజులు గడిచిపోయాయి ఆ ప్రకటన చేసి. అయితే ఆ ప్రకటనకు వ్యతిరేకంగా మడకశిర టీడీపీలోని ఒక వర్గం నిరసనలు తెలుపుతూ వచ్చింది. సునీల్ కు టికెట్ ఇవ్వకూడదంటూ ఆ వర్గం వాళ్లు రోడ్డుకు ఎక్కారు.
మరోవైపు సునీల్ కుమార్ ఇన్నాళ్లూ ప్రచారం చేసుకుంటూ పోయారు. అయితే చంద్రబాబు మార్పు నిర్ణయం తీసుకున్నారు. సునీల్ ను కాదని స్థానికేతరుడు అయిన మరో వ్యక్తిని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సునీల్ వర్గం రెచ్చిపోయింది. మడకశిరలోని టీడీపీ ఆఫీసుపై వీళ్లు దాడి చేశారు. చంద్రబాబు ఫొటోలను బయటకు తెచ్చి చెప్పులతో కొడుతూ నిరసన రేపారు. పార్టీ ఆఫీసులోని వస్తువులను బయటకు తీసుకొచ్చి నిప్పు పెట్టి తమ నిరసనను తెలిపారు!
ఇలా మడకశిరలో టీడీపీ లోని వర్గపోరు కొనసాగుతూ ఉంది. ముందుగా ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఒక వర్గం రెచ్చిపోయింది. ఇప్పుడు మార్పుతో మరో వర్గం రెచ్చిపోయింది. ఇలాంటి వారు ఒకరి విజయానికి మరొకరు సహకరించుకోవడం ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు! ఇదీ చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీపై ఉన్న పట్టుకు నిదర్శనం!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు