కడప నగరంలో ఎన్నికలకు సమాయత్తం కావడంలో వైసీపీ అట్టర్ ప్లాప్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. మరోవైపు టీడీపీ నెమ్మదిగా పైచేయి సాధిస్తోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. టీడీపీ, వైసీపీ ఓటుకు వెయ్యి చొప్పున పంపిణీ చేశాయి. అయితే టీడీపీ మాత్రం ప్రతి ఓటరుకూ డబ్బు చేర్చగా, వైసీపీ మాత్రం నిర్వహణ లోపంతో 60 నుంచి 70 శాతం మాత్రమే అందజేసినట్టు సమాచారం.
ఇదిలా వుండగా టీడీపీ రెండో దఫా మరో రూ.వెయ్యి పంపిణీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గత ఐదేళ్లలో అంజాద్బాషా, ఆయన కుటుంబ సభ్యులు మరో నాయకుడికి అవకాశం లేకుండా అడ్డంగా దోచుకున్నారని, ఆ సొమ్ములో కనీసం పది శాతం కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా అంజాద్బాషా తమ్ముడి వైఖరితో కడప నగరంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, చాపకింద నీరులా డిప్యూటీ సీఎంకు బలమైన వ్యతిరేకత కనిపిస్తోందని వైసీపీ నేతలే చెబుతున్నారు. దీంతో పార్టీలను కూడా చూడకూడదనే నిర్ణయానికి మెజార్టీ హిందువుల వచ్చారనే చర్చ కడపలో విస్తృతంగా సాగుతోంది. ఇదే సందర్భంలో అంజాద్బాషాపై ముస్లింలలోనూ వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు.
కాంగ్రెస్ తరపున కూడా ముస్లిం నాయకుడే బరిలో ఉన్నారు. కడపలో అంజాద్బాషా, ఆయన కుటుంబ సభ్యుల వైఖరితో వైసీపీకి నష్టం జరుగుతోందని చాలా కాలం నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ సీఎం జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం అంజాద్బాషానే ఆయన నమ్ముకున్నారు. తనపై వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ, దాన్ని డబ్బుతో ఎంతోకొంత పోగొట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదని వైసీపీ నేతలు వాపోతున్నారు.
కడప ఎంపీ అవినాష్రెడ్డి ఎందుకనో కడప గురించి అసలు పట్టించుకోవడం లేదు. అంజాద్బాషాకు వేయకపోయినా, తనకు క్రాస్ ఓటింగ్ చేస్తారని ఆయన నమ్ముతున్నట్టున్నారు. చేదు నిజం ఏంటంటే... కడప అసెంబ్లీ నియోజకవర్గం వరకూ ఏదైనా జరగొచ్చని వైసీపీ నేతలు బలంగా చెబుతున్నారు. గట్టి దెబ్బ పడితే తప్ప, జగన్కు జ్ఞానోదయం కాదులే అని సొంత పార్టీ నేతలు అంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు