Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

నోటి కాడ కూడు లాగేశారు... తమ్ముడి కడుపు మంట

నోటి కాడ కూడు లాగేశారు... తమ్ముడి కడుపు మంట

మండింది అంటే మండదా మరి. ఆకు వేసి అన్నం పెట్టి తీరా తినే సమయంలో నోటి కాడ కూడు లాగేశారు అంటున్నారు దగా పడిన తమ్ముడు ఒకరు. మాడుగుల సీటు నీదే అన్నారు. తొలి లిస్ట్ లో అనౌన్స్ చేశారు. ప్రచారం చేసుకోమన్నారు. అలా చేతిలో చమురు అంతా ఖర్చు చేశాక నామినేషన్ ఘట్టంలో మాత్రం బీ ఫారం చల్లగా తెచ్చి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చేస్తే మండదా మరి. అందుకే పైలా ప్రసాదరావు టీడీపీ మీద మండిపోతున్నారు.

తనను మోసం చేశారు అని ఆక్రోశిస్తున్నారు. ఆయన చేత గత కొన్నేళ్లలో చాలా ఖర్చు చేయించారుట. సాంతం నాకించేశారు అని అనుచరులు మధనపడుతున్నారు. అయిదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన ఒక ఆర్ధిక వనరుగా మారి పార్టీకి భుజం మోసారని అంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు రాష్ట్ర కార్యక్రమాలకు కూడా ఆయన చేతి చమురు వదిలించుకున్నారని అంటున్నారు.

ఇదంతా చేసింది ఎన్నికల్లో పోటీకి టికెట్ కోసమే. తీరా టికెట్ ఇచ్చి ఇప్పుడు లాగేసుకోవడమేంటి అని ఆయన మండుతున్నారు. ఇది టికెట్ రాకపోయినా ఇవ్వకపోయినా ఉన్న బాధ కంటే వంద రెట్లు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేనేళ్ల పాటు టీడీపీకి కొమ్ము కాసినందుకు ఇదా ప్రతిఫలం అని ఆయన వాపోతున్నారు.

ఆయన తాజాగా మీటింగు పెడితే వేలాదిగా టీడీపీ తమ్ముళ్ళు తరలివచ్చారు. వారంతా జై పైలా అంటున్నారు. నీవేమి చేస్తే అది చేయ్ మేము రెడీ అంటున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పైలా రెబెల్ గా పోటీకి సై అంటున్నారు. ఆయన పోటీకి దిగితే మాత్రం ఇక పసుపు పార్టీకి అసలైన కష్తాలే అని అంటున్నారు.

అందరికీ పార్టీ పదవులు ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి బుజ్జగించిన టీడీపీ అధినాయకత్వం పైలాకు ఒక పదవి రెడీ చేస్తోంది అని అంటున్నారు. అయితే టికెట్ విషయంలోనే ఆయన పట్టుబడుతున్నారు. మాడుగులలో సైకిల్ కి బ్రేకులు వేసేలా ఆయన వైఖరి కనిపిస్తోంది అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?