మహేష్ ను ‘మార్కెట్’ చేయనున్న నమ్రత…

‘మీడియా షై’ అనే పేరున్న మహేష్‌బాబు… తన స్టైల్‌ను మార్చుకుంటున్నాడా? తన లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు సినిమా ప్రచారం విషయంలో మహేష్ ఈ సారి ‘దూకుడు’ ప్రదర్శించనున్నాడా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానలు వినిపిస్తున్నాయి.…

‘మీడియా షై’ అనే పేరున్న మహేష్‌బాబు… తన స్టైల్‌ను మార్చుకుంటున్నాడా? తన లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు సినిమా ప్రచారం విషయంలో మహేష్ ఈ సారి ‘దూకుడు’ ప్రదర్శించనున్నాడా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానలు వినిపిస్తున్నాయి. ప్రచారం పరంగా బాహుబలి విజయం నేర్పిన కొత్త పాఠాలే దీనికి కారణంగా కనిపిస్తున్నాయి. 

ఆగస్టు 7న వస్తున్న ‘శ్రీమంతుడి’ని విజయవంతుడిగా మార్చేందుకు మహేష్ భార్య నమ్రతా శిరోడ్కర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ సినిమా మార్కెటింగ్, ప్రమోషన్ బాధ్యతలు నమ్రత చూడనున్నారట. దీనిలో భాగంగానే మహేష్ తను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్స్ కూడా అటు సినిమా ప్రచారానికి కూడా ఉపకరించేలా ప్లాన్ చేస్తున్నారట. 

(ఇటీవలే  మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న టాటా స్కై ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది) ఎప్పుడూ లేని విధంగా మహేష్ సినిమాలో ఒక పాట మేకింగ్ వీడియోను సైతం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ‘చారు శీల’పాట మేకింగ్ వీడియో తెలుగు టివి చానెళ్లలో హల్‌చల్ చేస్తోంది. తమిళ్‌లో సెల్వదన్‌గా వస్తున్న ఈ చిత్రం దక్షిణాదిలో బాహుబలి తర్వాత వస్తున్న భారీ చిత్రం కావడం, ఇందులో మహేష్ బాబు కూడా ఒక నిర్మాత కావడం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి దోహదం చేశాయని చెప్పొచ్చు. 

స్వంత చిత్రాలకే కాకుండా ఇతర నిర్మాతల చిత్రాలకు కూడా  ప్రమోషన్ విషయంలో టాలీవుడ్ హీరోలు ఇంతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే… టాలీవుడ్ నష్టాలకు కొంత మేర గండి పడొచ్చేమోనని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.