పవన్ కు.. కాపులకు.. వేరే ఆప్షన్ వుందా?

జస్ట్ ఒక్క రోజు డిస్కషన్లు.. సీట్ల షేరింగ్ మీద. 32 సీట్లు పవన్ అడిగారంటూ వార్తలు. దాంతో మొత్తం జనసేన అభిమాన వర్గాలు తల్లకిందులు. చేగొండి లేఖ. అధికారం షేరింగ్ అత్యవసరం అంటూ హెచ్చరిక.…

జస్ట్ ఒక్క రోజు డిస్కషన్లు.. సీట్ల షేరింగ్ మీద. 32 సీట్లు పవన్ అడిగారంటూ వార్తలు. దాంతో మొత్తం జనసేన అభిమాన వర్గాలు తల్లకిందులు. చేగొండి లేఖ. అధికారం షేరింగ్ అత్యవసరం అంటూ హెచ్చరిక. ఇవన్నీ చూస్తుంటే భలే చిత్రంగా వుంది.

ఇక్కడ కీలకమైన పాయింట్లు కొన్ని వున్నాయి.

ఇప్పుడు పవన్ కు తెలుగుదేశంతో వెళ్లడం మినహా మరో గత్యంతరం వుందా?

విడిగా పోటీ చేసి జనసేన ఎన్ని సీట్లు గెలుచుకోగలదు?

విడిగా పోటీ చేస్తే అసలు 175 మంది అభ్యర్ధులు వున్నారా?

ఇవన్నీ పవన్ కు తెలుసు. ఈ సారి కనుక కొన్ని సీట్లు అయినా గెలుచుకోకపోతే జనసేనను మరో అయిదేళ్లు మనగలగడం చాలా కష్టం అన్న సంగతి కూడా పవన్ కు తెలుసు. అందుకే పవన్ తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నారు. ఎవరు ఏమనుకున్నా 2029 వరకు పార్టీని నిలబెట్టుకోవాలి అన్నది పవన్ ఆలోచన. కానీ జనసేన అభిమానుల ఆలోచన వేరుగా వుంది. వాళ్లు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు.

ముఖ్యంగా తాము లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం సాధించలేరు అనుకుంటున్నారు. అందువల్ల తమకు కావాల్సినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నది వారి భావన. పైగా జనసేన అమ్ముడుపోయింది అనే మాట పడితే వారికి చాలా ఇబ్బందిగా, బాధగా వుంటుంది. అందుకే కనీసం నలభై సీట్లు కావాలని కోరుకుంటున్నారు.

పవన్ ఇప్పుడు తన బేరం మొదలుపెట్టడమే 32 తో మొదలుపెట్టారని వార్తలు రావడంతో వారికి సహజంగానే చికాకుగా వుంటుంది. చాలా మంది మీడియాకు ఎక్కే అవకాశం వుండదు. కానీ వారిలో వారు డిస్కషన్ అయితే చేసుకుంటారు. చేగొండి లాంటి వాళ్లు లేఖలు సంధిస్తారు.

నిజానికి గ్యాసిప్ లకే ఇంత హడావుడి అయితే రేపు ఆ అంకెలే నిజమైతే ఇంకెంత హడావుడి వుంటుందో? బహిరంగ నిరసన వుంటుందో?

కానీ.. పవన్ కు మరో ఆప్షన్ లేనట్లే.. కాపులకు కూడా మరో ఆప్షన్ లేదు. వైకాపా బిసి జపం చేస్తోంది. తెలుగుదేశం కూడా బిసిల వైపే వుంది. జనసేన కాపుల ఓట్లు తెస్తుందన్నది ఆ తెలుగుదేశం ధీమా. ఇలాంటపుడు కాపులు ఎక్కడికి వెళ్తారు. జనసేన పల్లకీ మోయాల్సిందే.