Advertisement

Advertisement


Home > Politics - Analysis

చంద్రబాబు నమ్మకం జగన్ కోటరీ మీదేనా?

చంద్రబాబు నమ్మకం జగన్ కోటరీ మీదేనా?

గత నాలుగు రోజుల నుండి చంద్రబాబు చాలా ఆనందంగా, కాన్ఫిడెంట్ గా, నమ్మకంగా కనపడుతున్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు కళ్ళల్లో అమితానందం చూడటం ఇదే మొదటిసారి. వ్యవస్థలను మేనేజ్ చెయ్యటంలో చంద్రబాబుని మించిన నాయకుడు మన దేశంలోనే లేడు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. 

తాడేపల్లి వైసీపీ రాజకోటలో తన వ్యూహాలు అమలవ్వటమే చంద్రబాబు నమ్మకానికి కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పధకాల అమలు విషయం స్వయంగా సీఎం చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాటి వరకు చంద్రబాబు టచ్ చేయలేకపోయారు. 

ఏ రాజకీయపార్టీకి అయినా గ్రౌండ్ లెవెల్ నాయకత్వం వెన్నుముక లాంటిది. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ఫోకస్ చేసారు. పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వైసీపీ గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ వార్డు స్థాయి నాయకులు, 2019లో పార్టీ అధికారంలోకి రాగానే, స్థానిక అధివృద్ది పనుల్లో భాగంగా, పలు రకాల కాంట్రాక్టు పనులు చేసారు. దీని కోసం కొంత మంది అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టారు. 

తాడేపల్లి ఆఫీస్ లో ఉన్న తన మనిషి ద్వారా, వైసీపీ నాయకులు చేసిన కాంట్రక్టు పనుల బిల్లులకు డబ్బులు ఇవ్వకుండా చేసి, వైసీపీ నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర జరిగింది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎంతలా అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నిధులు విడుదల చెయ్యమని చెప్పిన పనులకు కూడా ఒక ఆఫీసర్ సంవత్సరాలు గడిచినా నిధులు విడుదల చెయ్యరు. ఇదే విషయం మీద చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. 

ప్రతి రోజు నాయకులు, ఎమ్మెల్యేల ఇళ్లకు వచ్చి దీని మీద అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వైసీపీ MLA లు ఉన్నారు. చేసిన ఒక పనికి డబ్బులు వస్తే నియోజకవర్గంలో ఇంకొక అభివృద్ధి అని చేసే అవకాశం ఉంటుంది. కానీ డబ్బులు రావు అని తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పనులు చెయ్యటానికి ఎవరూ ముందుకు రావటంలేదు. ఇక్కడే చంద్రబాబు పెద్ద విజయం సాధించారు. అసలే గ్రామ వాలంటీర్ల వల్ల తమకు విలువలేకుండా పోయింది అని బాధ పడుతున్న గ్రౌండ్ లెవెల్ వైసీపీ నాయకత్వాన్ని ఈ విధంగా చాలా వరకు బలహీనపరిచారు. దీని పర్యవసానం మనం MLC ఎన్నికల్లో చూసాము.

ముఖ్యమంత్రి చుట్టూ ఒక వలయం ఏర్పాటుచేసి తప్పుడు సమాచారం అందేలా కొంత మంది జగన్ నమ్మకస్తులను మేనేజ్ చేయగలిగారు. వాళ్లతో వైసీపీ సోషల్ మీడియాని బలహీనపరిచేలా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారాన్ని ప్రచారానికి నోచుకోకుండా, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనే స్లోగన్ ని అన్ని వర్గాలలో బలంగా తీసుకెళ్లారు. ఇక్కడ కూడా చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 

ఇకపోతే పార్టీ ముఖ్యమైన సమాచారాన్ని తన మనుషుల ద్వారా తెలుసుకోవడం, చివరికి క్యాబినేట్ మీటింగ్ లో కూడా తన మనుషులు కూర్చునే విధంగా చేయగలిగారు. ముఖ్యమైన పదవిలో ఉన్న తన మనిషిద్వారా MLA తో దురుసుగా మాట్లాడించటం, వాళ్ళ నియోజకర్గాల్లో బాలేదు అని తప్పుడు సర్వే రిపోర్టులు ఇప్పించటం, వారిని మానసికంగా వేధించటం, అభివృద్ధి పనుల బిల్లులకు డబ్బులు రాకుండా చూడటం, సీఎం గారి అప్పాయిమెంట్ దొరక్కుండా చూడటం, ఎప్పుడో అప్పాయిమెంట్ దొరికినా గాని పర్సనల్ గా ఏమి చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ వేరే వాళ్ళు ఉండటం, ఈ విధంగా జగన్ నమ్మకస్తులతోనే MLA లను అహం దెబ్బతినేలా అవమానపరచి పార్టీకి దూరంచేయ్యటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అని పలువురు మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబుకి ప్రజల్లో బలం లేకపోవచ్చు, కానీ మంత్రాంగం, యంత్రాంగం నడపటంలో కొట్టిన పిండి. పధకాలు ఇస్తున్నాం, ఇక మనకి తిరుగులేదు అని పక్కన జరుగుతున్న కుట్రలను గమనించి తగు చర్యలు తీసుకోకపోతే 2014 సీన్ రిపీట్ అవుతుంది అనటంలో సందేహంలేదు. రాజకీయంలో శత్రువులు బాహుబలిలో కట్టప్ప లాగా పక్కనే ఉంటారు. రాజకీయంలో మన చుట్టూ ఉన్నవాళ్లు సరైన వాళ్ళు కాకపోతే మన దగ్గరకి సరైన సమాచారం రాదు. 

సరైన సమాచారం లేకపోవటం వలన వ్యూహాలు రచించలేము కాబట్టి అది గెలుపు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు తెలివితేటలకు ఇంకా కాలం చెల్లలేదు అని మాత్రం గుర్తించాలి. చంద్రబాబు వ్యూహం తాడేపల్లి లో అమలు అయ్యి రిసల్ట్ కనపడేసరికి బాబు కళ్ళల్లో ఆనందం, గొంతులో ధైర్యం పక్కాగా కనపడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?