చంద్రబాబునాయుడికి ఓడిపోయేందుకు మిత్రపక్షం రూపంలో బీజేపీ కలిసొచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకుని, చేజేతులా కొన్ని నియోజకవర్గాల్లో ఓటమిని మూటకట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే, ఏమవుతుందో అనే భయమే బాబుని నిలువునా ముంచుతోందని సొంత పార్టీ నేతలు సైతం అంటున్న మాట.
ఇటీవల కాలంలో ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ అమిత్షా ముస్లింలపై చేస్తున్న కామెంట్స్ తీవ్ర విద్వేషపూరితంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో పొత్తు వల్ల కలిగే లాభం కంటే, నార్త్ ఇండియా, అలాగే తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమయ్యాయి. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మైనార్టీల రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ కుండబద్ధలు కొట్టినట్టు తేల్చి చెప్పింది.
అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్షా బలంగా చెబుతున్నారు. తాజాగా ప్రధాని తన స్థాయిని మరిచి, ముస్లింలపై దారుణ కామెంట్స్ చేశారని ప్రపంచం నివ్వెరపోతోంది. కాంగ్రెస్కు ఓటు వేస్తే, మనందరి ఆస్తుల్ని, అలాగే తల్లులు, సోదరీమణుల బంగారు, చివరికి మంగళసూత్రాల్ని సైతం ముస్లింలకు పంచుతారంటూ సాక్ష్యాత్తు ప్రధానే విమర్శించడం కలకలం రేపుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్షా తదితర బీజేపీ అగ్రనేతలు తమపై ఎలాంటి విద్వేష కామెంట్స్ చేస్తున్నారో ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనార్టీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంతిమంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనలకు ఏపీలో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు దూరమయ్యే పరిస్థితి.
బీజేపీతో పొత్తు పెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదేమో అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వణికిపోతున్నారు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన బాబులో కనిపిస్తోంది. ఎందుకంటే అధికారం రాకపోతే, కూటమిలోని జనసేన, బీజేపీలకు వచ్చే నష్టమేమీ లేదు. ఈ రెండు పార్టీలకు పోగొట్టుకోడానికి కూడా ఏదీ లేదు. కానీ టీడీపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైంది.
ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు పోతాయని చంద్రబాబుకు తెలుసు. కానీ మోదీ, అమిత్షా హిందువుల ఓట్లు కొల్లగొట్టేందుకు ముస్లింలపై ఇలాంటి విద్వేష కామెంట్స్ చేస్తారని చంద్రబాబు ఊహించి వుండరు.
ఇవన్నీ ఎన్నికల్లో వైసీపీకి మరింతగా కలిసి వస్తాయనే చర్చకు తెరలేచింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని, వ్యవస్థల సహకారం లభిస్తుందని ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, అసలుకే మోసం వచ్చేలా వుందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. బీజేపీతో పొత్తుపై పశ్చాత్తాపం... చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎందుకంటే... దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తుండడమే. బీజేపీతో పొత్తు వల్ల ఇవన్నీ వైసీపీకి అప్పనంగా అప్పగించినట్టు అవుతోందని టీడీపీ ఆందోళన చెందుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు