ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ అడ్డంగా దొరికింది. 2019, జూలైలోనే అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడారు. చట్టానికి మద్దతు తెలిపారు. గొప్ప ఆశయంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన ప్రశంసించారు. ఈ చట్టం మనదేశానికి కొత్తదే తప్ప, 150 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. అలాగే 2016లో రాజస్థాన్లో ఇలాంటి చట్టాన్నే ఆమోదించారన్నారు.
అలాగే ఎల్లో చానల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ గొప్పతనం గురించి నాలుగు నెలల క్రితం కథనం ప్రసారమైంది. అది ఇప్పుడు బయట పడింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల నోళ్లు మూత పడ్డాయి. ప్రతిరోజూ ఈనాడు పత్రికలో ఫస్ట్ పేజీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై భారీ కథనాన్ని ప్రచురించేది. అలాగే ఈ చట్టంపై టీడీపీ, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్ విమర్శల్ని ప్రముఖంగా ప్రచురించేది.
ఈ రోజు ఆ దృశ్యం కనిపించలేదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ముఖ్యంగా టీడీపీ ద్వంద్వ వైఖరి బట్టబయలు కావడంతో, ప్రజలు ఛీ కొడతారనే భయం పట్టుకుంది. లోపలి పేజీల్లో కూడా తమకు అనుకూలమైన రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లు, ఇతరత్రా తటస్థుల ముసుగులో ఉన్న మేధావుల అభిప్రాయాల్ని మాత్రమే ప్రచురించడాన్ని గమనించొచ్చు.
టీడీపీ, జనసేన నేతల ఆరోపణలేవీ కనిపించలేదు. ఎల్లో బ్యాచ్ యూటర్న్కు ఇదే నిదర్శనం. చట్టసభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతు పలికి, ఇప్పుడు దాన్నే అస్త్రంగా తీసుకుని ప్రజల్ని భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం వారికే చెల్లింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు