Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ :సిపిఎం ఆవిర్భావం - 08

1920 ప్రాంతానికి కమ్యూనిజం వ్యాప్తికై రష్యా ప్రయత్నించే రోజుల్లో దాని దృష్టి సహజంగా భారతదేశంపై పడింది.  చైనాలో అప్పటికే కమ్యూనిజం ప్రభవిస్తోంది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యపు కిరీటంలో కలికి తురాయిగా వున్న భారతదేశం వామపంథావైపు మొగ్గితే అంతకంటె యింకేం కావాలి? భారతదేశంలో అప్పటి పరిస్థితి ఏమిటి? కొన్ని చోట్ల బ్రిటిషు పాలన, మరి కొన్ని చోట్ల బ్రిటిషు సూపర్‌విజన్‌లో సంస్థానాధీశుల పాలన నడుస్తోంది. సంస్థానాధీశుల్లో చాలా కొద్దిమంది తప్ప తక్కినవాళ్లందరూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. జమీందార్ల పీడన సాగుతోంది. ప్రజలలో, వ్యవసాయదారుల్లో అసంతృప్తి వుంది. కొన్ని చోట్ల పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలు కార్మికులను వేధిస్తున్నారు. ఈ అన్యాయాలను గమనించిన కొందరు విద్యావంతులు శ్రామికుల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన సంఘాలుగా ఏర్పడి ఎదిరిస్తున్నారు. వీరిలో అందరూ వామపక్షవాదులు కాదు. అప్పట్లో ప్రజాచైతన్యానికి ప్రతిరూపంగా కాంగ్రెసు పార్టీ వుంది కాబట్టి కాంగ్రెసు పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలు పనిచేసేవి. 

కాంగ్రెసు పార్టీ అంటే మొదటినుంచీ కలగూరగంప. పూర్తి రైటిస్టుల నుండి, పూర్తి లెఫ్టిస్టుల వరకు అందరూ దానిలో వుండేవారు. అసలు అప్పట్లో అందుబాటులో వున్న వేదిక అదొక్కటే. జనసామాన్యానికి తెలిసిన పేరు అదే. ''రామరాజ్యానికి రహదారి'' నవలలో పాలగుమ్మి పద్మరాజుగారు ఒక సంఘటన రాస్తారు - గాంధీని విమర్శించే కమ్యూనిస్టు ఒకతను రైల్వే స్టేషన్‌లో అరెస్టవుతాడు. ప్రజలు అతన్ని చుట్టుముట్టి పోలీసులను ప్రతిఘటిస్తారు. వారందరూ యిచ్చే నినాదం - 'మహాత్మా గాంధీకి జై'! అందుకే ఏపాటి రాజకీయ చైతన్యం వున్న వ్యక్తయినా కాంగ్రెసులోనే చేరేవారు. తర్వాతి రోజుల్లో పూర్తి పెట్టుబడిదారీ విధానాలతో, సంస్థానాధీశుల పక్షాన వాదించిన స్వతంత్ర పార్టీ స్థాపించిన రాజాజీ చేరినది, ఎదిగినదీ కాంగ్రెసులోనే. కాంగ్రెసు విధానాలతో పూర్తిగా విభేదించే బిజెపికి పూర్వరూపమైన జనసంఘ్‌ స్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ కాంగ్రెసులోనే వుండేవారు. కాంగ్రెసు బద్ధశత్రువులుగా పేరు బడిన సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్‌, ద్రవిడ కజగం రామస్వామి నాయకర్‌, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నంబూద్రిపాద్‌ - ఒకరా యిద్దరా, అందరూ తొలిథలో కాంగ్రెసులోనే చేరారు. చేరాక తమలాటి భావాలున్న వాళ్లతో కలిసి గ్రూపులు కట్టారు. కాంగ్రెసు స్టీరింగును తమ చేతిలోకి తీసుకుందామని ప్రతి గ్రూపూ ప్రయత్నించింది. ఒక్కోసారి ఒక్కో గ్రూపుది పై చేయి అయేది. 

అందుకే కాంగ్రెసు పార్టీ విధానాలలో వైవిధ్యం, పరస్పర వైరుధ్యం కనబడతాయి. పార్టీ ఒక్కటే, కుటుంబమూ ఒక్కటే. కానీ నెహ్రూ విధానం వేరు, ఇందిర విధానం వేరు, రాజీవ్‌ విధానం వేరు. ఇందిర కూడా పరిపాలనలో తొలిసగంలో అవలంబించిన విధానాలు వేరు, మలిసగంలో పద్ధతి వేరు. అందువలన ఆయా విధానాలు నచ్చినవారు ఆయా సమయాల్లో కాంగ్రెసుకు సమర్థకులుగా వుండేవారు, విధానం మారితే వీరు బయటకు వెళ్లిపోయేవారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కూడా బ్రిటిషు వారి పట్ల కాంగ్రెసు విధానం మారుతూ వచ్చింది. గోఖలేది మితవాదం, టిళక్‌ (తిలక్‌) అతివాదం. గోఖలేకి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గాంధీ తనకంటూ వేరే బాట వేసుకున్నాడు. నెహ్రూ గాంధీకి అనుచరుడిగా వుంటూనే అనేక విషయాల్లో బహిరంగంగా విభేదించేవాడు. వారిద్దరిదీ తండ్రీ-కొడుకుల బంధం వంటిది. విరుద్ధభావాలు, అయినా ఒకరి పట్ల మరొకరికి అపారమైన గౌరవం. బోసు, పటేల్‌, ప్రకాశం - అందరూ కొన్ని విషయాల్లో గాంధీని వ్యతిరేకించినవారే, కొన్ని విషయాల్లో అనుసరించినవారే. ఒకలా పోలిక చెప్పాలంటే కాంగ్రెసు పార్టీ హిందూమతం లాటిది. హిందూమతానికి నిర్దిష్టమైన విధానం అంటూ లేదు. శివుడు తప్ప అన్యులు దేవుళ్లు కారు అనేవారూ హిందువులే, విష్ణువు తప్ప యితరులు పూజ్యులు కారు అనేవారూ హిందువులే. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వంటి పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలన్నీ హిందూమతంలో భాగాలే. అంతెందుకు చార్వాకం వంటి నిరీశ్వరవాదాలు కూడా హిందూమతంలో అంతర్భాగాలే. ఇలాటి గందరగోళపు, నిర్దిష్టవ్యక్తిత్వం లేని, నిరంతర మార్పుకు గురయ్యే కాంగ్రెసును ఎలా నిర్వచించాలో, దానితో ఎలా వ్యవహరించాలో తెలియకనే కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో దెబ్బ తింది. 

అసలు కాంగ్రెసు పార్టీ స్వభావంతో కమ్యూనిస్టులకు ఏమి పని? తమ పార్టీ సంగతేదో తాము చూసుకోవచ్చు కదా అనుకోవచ్చు. దీనికి సమాధానం పైనే చెప్పాను. ఏకలక్ష్యంతో పనిచేసే ప్రజాదరణ కలిగిన జాతీయపార్టీలతో కొంతకాలం భుజం కలిపి, అదను చూసి దాన్ని దెబ్బ తీసి తాము అగ్రస్థానానికి రావాలని కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చెపుతూ వుంటారు. చైనాలో అది జరిగింది. చైనా ప్రయోగాన్ని యిక్కడ కూడా అమలు చేద్దామని రష్యా అనుకుంది కాబట్టి ఇక్కడ చైనా కథ కాస్త చెప్పుకోవాలి. చైనాలో రాజరికం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. చివరి ఒక రాణిగారు తెర వెనక్కాల వుండి చక్రం తిప్పుతూ పారాడే ఓ పసిబాలుణ్ని 1900 సం||రంలో చక్రవర్తి చేసింది. తనకు 93 యేట మృత్యువు వచ్చేదాకా పాలించింది. అప్పటికే పారిశ్రామికీకరణ జరిగి యూరోప్‌ దేశాలన్నిటిలో ప్రజలు బలపడి, రాజులు బలహీనపడ్డారు. ఆ విధానాలు యిక్కడకు పాకితే తన ప్రజలకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి కొత్త ఐడియాలు వస్తాయన్న భయంతో ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి జంకింది. దానివల్ల చైనా బలహీనపడి స్థానిక పాలకులు పీడకులయ్యారు. మరోపక్క యూరోపియన్‌ దేశాలు ఆర్థిక దోపిడీ చేశాయి. ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి, అసమర్థత పెరిగాయి. ప్రభుత్వానికీ ప్రజలకూ దూరం పెరిగింది. కరువులు, వరదలు, దాంతో కొంతమంది బందిపోట్లుగా మారడం! ఈ చక్రవర్తులు పోతేగానీ దేశం బాగుపడదని అందరూ అనుకున్నారు.    

ముసలి మహారాణిగారు పోయిన తర్వాత ఈ చిన్నకుర్రాడిని సింహాసనంపై కూర్చోపెట్టి మంత్రులు యిష్టం వచ్చినట్టు పాలించారు. వాళ్ల పాలన యింకా అధ్వాన్నం. విదేశీ శక్తులు - అంటే బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, జపాన్‌, పోర్చుగల్‌, జర్మనీ - దీన్ని అలుసుగా తీసుకుని చైనాను ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ మధ్య పంచేసుకున్నాయి. అతి ప్రాచీనకాలం నుండి స్వాతంత్య్రం అనుభవించిన చైనా గతి యిలా అవడం చదువుకున్న చైనీయులను బాధించింది. వారిలో సన్యట్‌సెన్‌ అనే ఓ డాక్టర్‌ విప్లవం లేవదీశాడు.  (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6

Click Here For Part-7

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?