వ్యక్తిని చితకబాదిన మోహన్‌బాబు సిబ్బంది

సినీ నటుడు మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనలో దెబ్బలు తిన్నది ఓ మంత్రిగారి కారు డ్రైవర్‌ కావడం గమనార్హం. దెబ్బలు తిన్న డ్రైవర్‌ నాగరాజు, పోలీసులను ఆశ్రయించాడు. తెలంగాణ…

సినీ నటుడు మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది ఓ వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనలో దెబ్బలు తిన్నది ఓ మంత్రిగారి కారు డ్రైవర్‌ కావడం గమనార్హం. దెబ్బలు తిన్న డ్రైవర్‌ నాగరాజు, పోలీసులను ఆశ్రయించాడు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు నాగరాజు.

అసలేం జరిగిందంటే, నాగరాజు హైద్రాబాద్‌లోని ఫిలింనగర్‌లోగల మోహన్‌బాబు ఇంటి ముందు తెలిసినవారిని కలవడానికి నిలుచుని వున్నాడు. అది గమనించిన మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది అనుమానంతోనో, ఇంకో కారణంతోనో నాగరాజుని చితకబాదారు. నలుగురు వ్యక్తులు ముష్టిఘాతాలతో, కర్రలతో విరుచుకుపడ్డంతో నాగరాజుకి గాయాలు బాగానే తగిలినట్లు తెలుస్తోంది.

ఇక, నాగరాజు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, అతనిపై దాడి చేసిన ‘బౌన్సర్లను’ అదుపులోకి తీసుకున్నారు. గతంలో ‘దేనికైనా రెడీ’ సినిమా వివాదం నేపథ్యంలోనూ ఇలానే మోహన్‌బాబు ఇంటి వద్ద గలాటా చోటు చేసుకుంది. కొందరు ఆందోళనకారులు తమ ఇంటిపై దాడి చేశారని మోహన్‌బాబు కుటుంబీకులు ఆరోపిస్తే, మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది తమను చితకబాదారని ఆందోళనకారులు ప్రత్యారోపణలు చేశారు. ఆ వివాదం ఎలాగో సద్దుమణిగిందనుకోండి.. అది వేరే విషయం.

తాజా వివాదంపై మోహన్‌బాబు కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.