మాజీ మంత్రికి బాబు బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నారా?

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ కి చెందిన టీడీపీ యువ నాయకుడు కిడారి శ్రావణ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు తాజాగా జరిగాయి. ఆయన అభిమానులు అనుచరులు ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ…

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ కి చెందిన టీడీపీ యువ నాయకుడు కిడారి శ్రావణ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు తాజాగా జరిగాయి. ఆయన అభిమానులు అనుచరులు ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ ఉన్నత పదవులు అలంకరించాలని వారు మనస్పూర్తిగా కోరుకున్నారు.

కిడారికి అలాగే మనసులో ఉంది. ఆయనను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా ఆనాడు చేశారు. 2019 ఎన్నికల్లో అరకు నుంచి ఓటమి పాలు కాగానే ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని అనుకున్నా ఆశాభంగమే అయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కుతుందని ఆయన ఆశిస్తున్నారు. రాష్ట్ర గిరిజన కార్పోరేషన్ చైర్మన్ పదవి ఆయనకు ఇస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ పదవి అయితే చేతిలో పడలేదు. రెండవ విడత నామినేటెడ్ పదవుల పందేరం తొందరలో ఉంటుందని అంటున్నారు.

దాంతో కిడారికి ఈ విడత అయినా శుభవార్త చెబుతారా అని ఆయనతో పాటు అనుచరులు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా బర్త్ డే జరుపుకున్న కిడారికి బర్త్ డే గిఫ్ట్ ని అధినాయకుడు చంద్రబాబు ఇస్తున్నారా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. గిఫ్ట్ ఇస్తే కనుక అది ఘనంగా ఉండాలని కిడారి రేపటి రాజకీయ ఆశలకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు.

ఇంతకీ ఈ కిడారి ఎవరో కాదు 2018 సెప్టెంబర్ లో మావోయిస్టుల చేతిలో హతమైన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు. ఆనాడు సానుభూతి కోణంలో ఆయనకు ఏకంగా మంత్రి పదవే వరించి వచ్చింది. ఆ తరువాత మాత్రం పదవి అంటే ఎంతలా వేచి చూడాలో కూడా అర్ధం అయింది అని అంటున్నారు.