బెంగళూరులో ఒక స్టార్టప్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న బెంగాళీ మహిళ సుచన పసికందులాంటి తన నాలుగేళ్ల కొడుకును దారుణంగా హతమార్చడం విస్మయాన్ని కలిగిస్తోంది. గోవా టూర్ కు అంటూ కొడుకును తీసుకెళ్లి.. హోటల్ రూమ్ లోనే ఆ పసిపిల్లాడిని దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత విస్మయకరమైన రీతిలో ఆ పిల్లాడి మృతదేహాన్ని బ్యాగులో తీసుకుని ఈమె తిరిగి బెంగళూరు చేరే ప్రయత్నం చేయడం మరింత షాకింగ్ గా ఉంది.
నాలుగేళ్ల పసివాడిని ఈమె దారుణంగా హతమార్చడానికి భర్తతో గొడవలే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తూ ఉండగానే ఈమె భర్తపై కోపంతో పసివాడిపై ఘాతుగానికి పాల్పడినట్టుగా ఉంది. సదరు సుచన మామూలు వ్యక్తి కాదు.. బోలెడన్ని డిగ్రీలను సంపాదించిన వ్యక్తి. తన మేధస్సుతో బ్రిలియంట్ ఉమన్ అనిపించుకున్న వ్యక్తి. ఏఐ ల్యాబ్ పేరుతో సొంతంగా ఒక స్టార్టప్ ను మొదలుపెట్టి ఈమె గౌరవనీయమైన స్థాయిలో ఉంది. చదువు విషయానికి వస్తే ఈమె ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిందట, ఆ పై సంస్కృతంలో ఇంకో పీజీ చేసిందట, ఏఐ- డేటా సైన్స్ లో ప్రావీణ్యం సంపాదించి ఐటీ కంపెనీని స్టార్ట్ చేసేంత వరకూ వెళ్లిందట!
ఎంత ప్రతిభ ఉంటే ఏం ప్రయోజనం? భర్తతో గొడవలతో పసివాడిపై తన కర్కశత్వాన్ని ఈమె ప్రదర్శించింది. హోటల్ కు పిల్లాడితో కలిసి వెళ్లిన ఈమె, చెక్ ఔట్ సమయంలో ఒక్కతే బయటకు వచ్చిందట! బెంగళూరుకు తనకో క్యాబ్ బుక్ చేయాలని గోవాలోని హోటల్ స్టాఫ్ చేతే ఈమె క్యాబ్ బుక్ చేయించుకుందట, దీంతోనే ఈమె పోలీసులకు సులభంగా దొరికింది.
ఈమె చెకౌట్ తర్వాత రూమ్ ను శుభ్రం చేయడానికి వెళ్లిన వారు రూమ్ లో రక్తంమరకలను గమనించారట, ఆమె పిల్లాడితో కాకుండా ఒక్కతే చెకౌట్ కావడంతో హోటల్ సిబ్బందికి అనుమానాలు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అలర్ట్ అయిన పోలీసులు ఆమెకు ఫోన్ చేసి పిల్లాడి సమాచారం గురించి అడిగారు. తను పిల్లాడిని గోవాలోని తనకు తెలిసిన వారి ఇంట వదిలినట్టుగా ఆమె పోలీసులకు తప్పుడు అడ్రస్ ఇచ్చింది. ఆ విషయాన్ని గ్రహించి.. పోలీసులు క్యాబ్ డ్రైవర్ కు కాల్ చేసి ఆమెను దగ్గర్లోని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. ఆమెకు అర్థం కాకుండా డ్రైవర్ తో పోలీసులు కొంకణిలో మాట్లాడి చిత్రదుర్గ పోలిస్ స్టేషన్ కు క్యాబ్ ను తీసుకెళ్లేలా చూశారు. అక్కడ అసలు సంగతి బయటపడిందని తెలుస్తోంది!
పిల్లాడిని చంపిన అనంతరం ఆమె తను ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూసిందని పోలీసులు చెబుతున్నారు. మణికట్టుపై కోసుకుని ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. 39 యేళ్ల వయసు ఉండి, చదువు సంధ్యలుండి.. ఇలాంటి పనులు చేయడం అంటే, క్షణికావేశం అనాలో, మానసిక రోగం అనాలో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు