Advertisement

Advertisement


Home > Politics - National

తల్లి ప్రేమ.. పిల్లల కోసం ప్రాణాల్ని సైతం..!

తల్లి ప్రేమ.. పిల్లల కోసం ప్రాణాల్ని సైతం..!

తల్లి ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవంటారు. బిడ్డ కోసం తల్లి ఏ త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఇది కూడా అలాంటి ఘటనే. రైలు ట్రాక్ పై పడిన బిడ్డల్ని కాపాడేందుకు, ఏకంగా తల్లి తన శరీరాన్ని రక్షణంగా ఉంచింది. తను చనిపోయినా పర్వాలేదు, బిడ్డలు బతికితే చాలనుకుంది.

బిహార్ లోని భార్ రైల్వే స్టేషన్. ఢిల్లీ వెళ్లే విక్రమ్ శిలా ఎక్స్ ప్రెస్ కోసం ఫ్లాట్ ఫామ్ పై అందరూ ఎదురుచూస్తున్నారు. ట్రైన్ రానే వచ్చింది. దీంతో అంతా ఒకేసారి ఎగబడ్డారు. కొద్దిసేపు మాత్రమే ఆగే రైలు ఎక్కేందుకు పోటీపడ్డారు.

ఈ క్రమంలో ఇద్దరు బిడ్డలతో పాటు ట్రయిన్ ఎక్కడానికి ప్రయత్నించిన ఆ తల్లి విఫలమైంది. కాలుజారి పిల్లలతో సహా పట్టాలపై పడింది. ఫ్లాట్ ఫామ్ కు, ట్రయిన్ కు మధ్య ఉన్న గ్యాప్ లో అంతా పడ్డారు. అదే టైమ్ లో ట్రయిన్ కదలడం ప్రారంభించింది.

దీంతో రెప్పపాటు కాలంలో తల్లి, తన పిల్లలిద్దర్నీ కప్పేసింది. వాళ్లపై తను పడుకుంది. తన ప్రాణాలు పోయినా, బిడ్డల ప్రాణాలు నిలిస్తే చాలనుకుంది. చూస్తుండగానే ట్రయిన్ వేగం పుంజుకుంది. దీంతో చుట్టుపక్కల జనాలు భయభ్రాంతులకు గురయ్యారు.

అప్పటికే ట్రయిన్ ఎక్కిన తండ్రి, విషయం తెలుసుకొని అమాంతం రైలు నుంచి ఫ్లాట్ ఫామ్ పైకి దూకేశాడు. అయితే అదృష్టవశాత్తూ తల్లితో పాటు పిల్లలకు ఏం కాలేదు. ట్రయిన్ ఫ్లాట్ ఫామ్ దాటిన వెంటనే తల్లితో పాటు, పిల్లలిద్దర్నీ పైకి తీసుకొచ్చారు స్థానికులు.

వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. సురక్షితంగా బయటపడ్డారు. తన పిల్లల కోసం తల్లి చేసిన ఆ సాహసోపేతమైన పనిని అంతా మెచ్చుకున్నారు. తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుందంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?