నెల రోజుల్లో కోటిన్నర సంపాదించిన రైతు

దేశవ్యాప్తంగా టమాట ధరలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. మరి పెరుగుతున్న ధరల వల్ల టమాట పండిస్తున్న రైతు లబ్ది పొందుతున్నాడా లేదా దళారులే రాజ్యమేలుతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే నేరుగా…

దేశవ్యాప్తంగా టమాట ధరలు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. మరి పెరుగుతున్న ధరల వల్ల టమాట పండిస్తున్న రైతు లబ్ది పొందుతున్నాడా లేదా దళారులే రాజ్యమేలుతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే నేరుగా టమాటాలు విక్రయించే రైతులు భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.

మహారాష్ట్రలోని పూణె జిల్లా జూన్నార్ కు చెందిన ఓ రైతు జస్ట్ 30 రోజుల్లో టమాటాలు అమ్మి కోటిన్నర సంపాదించాడు. పెరిగిన టమాట ధరలతో ఓవైపు సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తుకారాం భాగోజీ గయాకర్ అనే ఈ రైతు మాత్రం జాక్ పాట్ కొట్టాడు.

తుకారాంకు 18 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 12 ఎకరాల్లో కొడుకు ఈశ్వర్, కోడలు సోనాలి సహకారంతో టమాట సాగు చేశాడు. ఎరువులు, పురుగు మందులపై పూర్తి అవగాహన ఉన్న తుకారం, నాణ్యమైన టమాటాల్ని పండించాడు. ఓవైపు రేటు ఆకాశాన్నంటిన టైమ్ లో ఈ టమాటాలు చేతికొచ్చాయి.

అలా నెల రోజుల్లో దశలవారీగా 13వేల టమాట డబ్బాలను అమ్మి, అక్షరాలా కోటి 50 లక్షల రూపాయలు సంపాదించింది ఈ కుటుంబం. ధర బాగా ఎక్కువగా రోజుల్లో సింగిల్ డేలో 900 డబ్బాలు అమ్మి, 18 లక్షల రూపాయలు సంపాదించింది ఈ కుటుంబం.

తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, పంట కోయడం, ప్యాకేజింగ్ చేయడం వంటి పనులను నిర్వహిస్తుండగా, అతని కుమారుడు ఈశ్వర్ విక్రయాలు, నిర్వహణ, ఆర్థిక ప్రణాళికలను నిర్వహిస్తున్నాడు. మార్కెట్‌కు అనుకూలమైన పరిస్థితులు నెలకొనడంతో గత మూడు నెలలుగా శ్రమించి మంచి లాభాలు పొందారు.

అయితే ఈ ప్రాంతంలో తుకారం కుటుంబం మాత్రమే కాకుండా, దాదాపు చాలామంది రైతులు కోటీశ్వరులయ్యారు. జున్నార్ వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీ ద్వారా 100 మంది మహిళలు, 2 నెలల్లో 80 కోట్ల రూపాయల టమాటాలు అమ్మారు.