దారుణం: 2 రూపాయల కోసం హత్య

5 రూపాయల ఫ్యాక్షన్ గురించి విన్నాం. ఇది కూడా దాదాపు అలాంటిదే. కేవలం 2 రూపాయల కోసం జరిగిన హత్య ఇది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ దారుణం జరిగింది. జస్ట్ 2 రూపాయల…

5 రూపాయల ఫ్యాక్షన్ గురించి విన్నాం. ఇది కూడా దాదాపు అలాంటిదే. కేవలం 2 రూపాయల కోసం జరిగిన హత్య ఇది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ దారుణం జరిగింది. జస్ట్ 2 రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇద్దరూ పంతానికి పోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు హంతకుడిగా మిగిలిపోయాడు.

సైకిల్ కు గాలికొట్టి 2 రూపాయలు అడిగాడు సువర్ణరాజు. తననే డబ్బులు అడుగుతావా అంటూ గద్దించాడు అప్పారావు. 2 రూపాయలకే కక్కుర్తిపడతావా అంటూ పరువు తీశాడు సువర్ణరాజు. దీంతో అప్పారావు ఇగో హర్ట్ అయింది. నువ్వు అడిగితే 2 రూపాయలు కాదు కదా 2 పైసలు కూడా ఇవ్వనన్నాడు. దీంతో సువర్ణరాజు వ్యక్తిగత దూషణకు దిగాడు. అప్పటికే సహనం కోల్పోయిన అప్పారావు ఆవేశంతో కత్తిదూశాడు.

కత్తి సువర్ణరాజు ఒంట్లోకి దూసుకెళ్లడం, అతడు అక్కడికక్కడే కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయాయి. వెంటనే స్థానికులు సువర్ణ రాజును కాకినాడలోని జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పూర్తిస్థాయిలో ప్రారంభంకాకముందే సువర్ణరాజు ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అప్పారావు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీళ్లిద్దరికీ నిత్యం పడదని, ఎప్పటికప్పుడు గొడవలు పడుతుంటారని అంటున్నారు స్థానికులు.