చంద్రబాబు నాయుడి రాజగురువు తనను తాను తిట్టుకుంటూ... రాసుకున్నారనే అభిప్రాయం కలిగించే కథనం ప్రచురితమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డిపై మరోసారి విరుచుకుపడుతూ ఎల్లో పత్రిక కథనం రాసింది. జవహర్రెడ్డి పేరుకు బదులు... ఆ స్థానంలో రాజగురువు పేరు చేర్చితే బాగుండేదని ఆ కథనం చదివిన వారెవరికైనా అభిప్రాయం కలుగుతోంది.
రాజగురువు పత్రిక చదివే ప్రతి పాఠకునికి నిత్యం రామోజీరావుపై ఏ అభిప్రాయం కలుగుతుందో, పొరపాటున జవహర్రెడ్డి గురించి పచ్చ పత్రిక రాసిందనే భావన కలుగుతోంది. ఇవాళ జహవర్రెడ్డి గురించి రాసిన విమర్శనాత్మక కథనంలో... ఆయన కంటే రాజగురువుకే ఈ వ్యాఖ్యలు బాగా కనెక్ట్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఆ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
"నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అతికినట్టు ఆ డైలాగ్ సరిపోతుంది"
పై వాక్యాలు చదివిన ఈనాడు పాఠకుడికి జవహర్రెడ్డికి బదులు రాజగురువే గుర్తు కొస్తారు. అలాగే మరికొన్ని వాక్యాలను చూద్దాం.
"ఎన్నికల్లో వైసీపీకి లబ్ది కలిగించడంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని అనుకుంటే... లేదు లేదు, అధికార పార్టీతో అంటకాగుతూ ... ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే వుంటా అని తన చేతల ద్వారా పదేపదే నిరూపించుకుంటున్నారు"
ఏపీ సీఎస్ జవహర్రెడ్డి మాత్రమే తటస్థంగా, నిష్పక్షపాతంగా వుండాలా? ఒక మీడియా సంస్థగా ఆ బాధ్యత, కర్తవ్యం రాజగురువుపై లేదని అనుకుంటున్నారా? చంద్రబాబుతో అంటకాగుతూ, ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే వుంటా అని తన రాతల ద్వారా పదేపదే నిరూపించుకుంటున్నదెవరో ప్రత్యేకంగా చెప్పాలా?
వృద్ధుల పింఛన్ల పంపిణీలో నిమ్మగడ్డ రమేశ్కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించింది టీడీపీ. బ్యాంక్ ఖాతాలకు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించానని నిమ్మగడ్డ చెప్పడాన్ని ప్రసారం చేసింది కూడా ఈటీవీనే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ సామాజిక పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. వృద్ధుల మరణానికి, అలాగే సామాజిక పింఛన్దారుల తీవ్ర ఇబ్బందులకు టీడీపీనే అని నమ్ముతున్నారని, దీని వల్ల రాజకీయంగా నష్టం వస్తుందని రాజగురువు శివాలెత్తిపోయి, జవహర్రెడ్డిపై రోజుకో రకంగా విద్వేష వార్తను వండివారుస్తున్నారు. ఈ విష వార్తల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో పాఠకులకు బాగా తెలుసు.
తాజాగా రైతు భరోసా, అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై ఈసీకి ఫిర్యాదు చేసి, నిలువరించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. మరోసారి టీడీపీ నేతృత్వంలోని కూటమికి నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రాజకీయ పార్టీల కంటే, ఎక్కువగా రాజగురువు ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. రాజగురువు భయం, ఆందోళన ఆయన మీడియా రాతల్లో ప్రతిబింబిస్తోంది.
"ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లలో ఆనందం కోసం , ఎవరికి అనుచిత ప్రయోజనాల కోసం జవహర్రెడ్డి ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించుకుంటే, జగన్, వైసీపీ కోసమే. ఆయన ఈ కుట్రను అమలు చేశారనేది తేటతెల్లమవుతుంది"
ఈ వాక్యాలు జవహర్రెడ్డి కంటే రాజగురువుకే నూటికి నూరుశాతం అతికినట్టు వుంటాయి. జవహర్రెడ్డికి బదులు రాజగురువు పేరు చేర్చి చదువుకుంటే... చంద్రబాబు, కూటమి కోసమే ఇంత దిగజారుడు రాతలు రాస్తున్నారని పాఠకులకు, ప్రజలకు తేటతెల్లం అవుతుందని చెప్పక తప్పదు. అన్నట్టు ఈ కథనంలో కొసమెరుపు ఏంటంటే... రెండు రోజుల క్రితం ఇదే పచ్చపత్రికలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనాకు వ్యతిరేక కథనం చూశాం. ఎప్పుడైతే రైతు భరోసా, విద్యార్థుల ఫీజురీయింబర్స్మెంట్ నిధులు అడ్డుకున్నారో, అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం అద్భుతంగా కనిపించడం గమనార్హం.
ఎన్నికల సంఘం ఈ కుట్రను పసిగట్టే నిధుల విడుదలకు బ్రేక్ వేసిందని పచ్చ పత్రిక రాయడం చూస్తే... ప్రజలపై ఎంత కసిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నాలుగు నెలల క్రితం ఈటీవీ చానల్లో అద్భుతం అంటూ కథనాన్ని ప్రసారం చేసి, తీరా ఇప్పుడు బయటపడే సరికి , కనిపించకుండా పెట్టిన మీడియాధిపతి కూడా ఇతరుల దిగజారుడు గురించి కథనాలు రాస్తున్నారంటే ... బరి తెగింపు కాక మరేంటి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు