ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, సీఎస్ జవహర్రెడ్డిలను మార్పించేందుకు కూటమి అలుపెరగని పోరాటం చేసింది. అయితే డీజీపీ మాత్రం తాజాగా బదిలీ అయ్యారు. సీఎస్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ ఎవరనే చర్చకు తెరలేచింది. ఏపీ ప్రభుత్వం ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపింది.
ఈ ముగ్గురు అధికారులు డీజీ ర్యాంక్ ఉన్న 1989, 1991, 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. అయితే వీళ్లలో ఏ ఒక్కరూ టీడీపీకి ఆమోద యోగ్యం కాదు. ఎందుకంటే టీడీపీ ఏబీ వెంకటేశ్వరరావును డీజీపీగా తెచ్చుకోవాలని ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించిందని వార్తలొస్తున్నాయి. ఏబీని డీజీపీగా నియమించడం అసాధ్యమని కొందరు చెబుతూ వచ్చారు. క్రిమినల్ కేసుల్లో ఏబీ ఇరుక్కోవడం, అలాగే అతి త్వరలో ఆయన పదవీ విరమణ చేస్తుండడంతో అసలు ఈసీ పరిగణలోకి తీసుకోదని అందరికీ తెలుసు.
కానీ టీడీపీ మాత్రం ఏబీని తెచ్చుకుంటే, ఎన్నికల్లో సగం గెలిచినట్టే అని భావించింది. టీడీపీ పప్పులేవీ ఉడకలేదు. ఏబీపై క్యాట్ విచారణ ఇంకా పెండింగ్లో వుంది. కనీసం ఆయన పదవీ విరమణ సమయానికన్నా కేసుల నుంచి బయటపడతారా? అంటే... లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా డీజీపీగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రతిపాదనపై టీడీపీ పెదవి విరుస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు కానప్పుడు, ఎవరైతేనేం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ అనుకూల డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి బదిలీ అయ్యాడనే సంతోషమే తప్ప, కొత్తగా వచ్చే పోలీస్ బాస్ తమకు అనుకూలం కాదనే ఆవేదన టీడీపీ నేతల్లో లేకపోలేదు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు