జనసేనాని పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో హద్దులు దాటుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినట్టే అనే భ్రమలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత రాత్రి ఆయన చంద్రబాబుతో కలిసి తిరుపతిలో రోడ్ షో, అనంతరం సభలో ప్రసంగించారు. అలిపిరిలో మందు పాతర్ల దాటికి చంద్రబాబు కారు16 అడుగులు పైకి ఎగిరి పడిందని, ఆయన తట్టుకున్న ధీరుడంటూ ప్రతి చోటా పొగడ్తలతో ముంచెత్తడం పనిగా పెట్టుకున్నారు.
తిరుపతికి వెళ్లి భూమన కరుణాకరరెడ్డి కోడి బొచ్చు అమ్ముకుని నెలకు రూ.20 లక్షలు సంపాదిస్తున్నారని పొంతన లేని విమర్శలు చేశారు. అలాగే భూమన రౌడీయిజానికి భయపడతారా? అంటూ ఆయన ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏడు కొండలు కాదు, రెండు కొండలే ఉన్నాయని వైఎస్సార్ అనడం వల్లే, గాలిలో కలిసిపోయారని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం నగరవాసుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
ఇంత కాలం తిరుమల నిధులను అభివృద్ధి పనులకు ఎలా ఉపయోగిస్తారని విమర్శలు చేసి... ఇప్పుడు ఆయనే స్విమ్స్, రుయాలో మౌలిక వసతుల కల్పనకు ఖర్చు పెడతామనడం విడ్డూరంగా వుంది. ఎన్నికల్లో ఓటర్లకు వైసీపీ ఇచ్చే రూ.2 వేలు... టీటీడీ సొమ్మని, దాన్ని తీసుకెళ్లి తిరుమలలో హుండీలో వేయాలని పవన్ పిలుపు ఇవ్వడం గమనార్హం.
ఇలా నోటికొచ్చినట్టు పవన్ తిరుపతిలోనే కాదు, ప్రతి సభలోనూ మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి మేనిఫెస్టో గురించి పవన్ అసలు మాట్లాడ్డం లేదు. ఆ పనేదో చంద్రబాబు చేస్తారన్నట్టుగా పవన్ కేవలం ప్రత్యర్థులపై తిట్లకే పరిమితం అయ్యారు. తొక్కి నార తీస్తామనడం, జైలుకు పంపుతామని హెచ్చరించడం పవన్కే చెల్లింది. ఈయన గారి అతి వాగుడు కొన్ని వర్గాలను ఇరిటేట్ చేస్తోందన్నది వాస్తవం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు