హిందూమహా సముద్రంలోని చిన్నపాటి దీవుల సముదాయం మాల్దీవ్స్. మొన్నటి వరకూ భారతీయుల ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్. సెలబ్రిటీలు, సామాన్యులు తేడా లేకుండా.. మాల్దీవుల బీచ్ లలో ఫొటోలు దిగాలనే ఆసక్తిని చూపిన వారే! తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మాల్దీవులకు టూరెళ్లే వాళ్లు బోలెడంతమంది. ఇక చిన్నసైజు సెలబ్రిటీలు కూడా అక్కడకు వెళ్లి ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునే పయత్నాలు చేశారు. ఇప్పుడు మాల్దీవుల మంత్రుల కామెంట్స్ తో వ్యవహారం బాయ్ కాట్ వరకూ వచ్చింది.
అయినా గట్టిగా ఐదు లక్షల జనాభా ఉన్న ఒక దేశం నుంచి అలాంటి దురహంకారకూతలు రావడమే విడ్డూరం! అయితే మాల్దీవుల ప్రభుత్వం ఎప్పుడో ఇండియాను లైట్ తీసుకోవడంతోనే అలాంటి మాటలు వచ్చాయని స్పష్టం అవుతోంది. మరి ఇప్పుడు మాల్దీవులపై భారతీయుల కోపం తాత్కాలికమైనదేనా.. లేక దీర్ఘకాలం పాటు ఈ బహిష్కరణ ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే!
మరి ఇంతకీ ఇండియా బాయ్ కాట్ పిలుపుతో మాల్దీవులకు ఇబ్బంది ఉందా? అంటే.. ఉందని కచ్చితంగా చెప్పవచ్చు! కోవిడ్ తర్వాతి పరిస్థితుల్లో మాల్దీవుల్లో పర్యటించే అత్యధిక మంది టూరిస్ట్ లలో ఇండియన్సే ముందు వరసలో ఉన్నారు! గత ఏడాదిలో ఇండియా నుంచి సుమారు 2.20 లక్షలమంది మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యారట! ఆ తర్వాతి స్థానంలో రష్యా ఉంది. రష్యా నుంచి అటుఇటుగా రెండు లక్షలమంది ఆ దీవుల్లో పర్యటించారు.
కోవిడ్ పూర్వపు పరిస్థితులు మాత్రం కాస్త భిన్నం. చైనా నుంచి అత్యధికమంది టూరిస్టులు మాల్దీవుల్లో అప్పట్లో పర్యటించేవారు. కరోనాకు పూర్వం మాల్దీవుల్లో అత్యధికంగా పర్యటించినది చైనీయులు, యూరోపియన్లు. అయితే కోవిడ్ తర్వాత ఆ రెండు దేశాల నుంచి మాల్దీవుల పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఇండియా టాప్ లో ఉంది. ఐదు లక్షల జనాభా ఉన్న దేశానికి రెండు లక్షల మంది పర్యాటకులను ఇచ్చే దేశం కీలకమైనది. అందునా పర్యాటకమే ఇలాంటి దేశాలకు ప్రధాన ఆదాయ వనరు! మరి ఇండియన్ బాయ్ కాట్ ప్రభావంతో చైనా తన పర్యాటకులను పూర్వపు రోజుల్లా తమ దేశానికి పంపాలని మాల్దీవుల ప్రభుత్వం ఇప్పటికే ఆ దేశానికి విన్నపం కూడా చేసింది!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు