‘పచ్చ’ మేఘాలు తొలిగిపోతున్న వేళ

ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒక్కో అంశంపై నిశితంగా వారు చేస్తున్న విమర్శలకు టీడీపీ నుంచి సమాధానాలు కూడా కరువయ్యాయి. ఇన్నాళ్లూ వైసీపీ నేతల మాటలు కేవలం ఆరోపణలుగా మాత్రమే…

ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒక్కో అంశంపై నిశితంగా వారు చేస్తున్న విమర్శలకు టీడీపీ నుంచి సమాధానాలు కూడా కరువయ్యాయి. ఇన్నాళ్లూ వైసీపీ నేతల మాటలు కేవలం ఆరోపణలుగా మాత్రమే ప్రజలకు తోచేవి. ఎందుకంటే.. సాక్షి మినహా ఏ పత్రికా వాటికి ప్రాధాన్యత ఇచ్చేదికాదు, ఏ ఛానెల్ లోనూ వారి మాటల్ని అర నిమిషం కంటే ఎక్కువసేపు ప్రసారం చేయరు.

ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. సాక్ష్యాధారాలతో సహా టీడీపీ నేతలపై దాడికి దిగుతున్నారు. కనీసం టీడీపీ నేతల దగ్గర సమాధానాలు కూడా లేవంటే.. ఇన్నాళ్లూ వారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇట్టే అర్థమవుతుంది.

పోలవరంలో నిర్మాణ పనులు చూసే ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్.. ఇద్దరు ఒకరే. అంటే ఆయనే దొంగ, ఆయనే పోలీస్. ఇలా తమ తప్పులు బైటపడకుండా టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నిందీ, అనుకూల మీడియా సాయంతో ఎలా ప్రజల్ని మోసం చేసిందీ ఇప్పుడు బహిర్గతమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా ఆ తప్పులన్నింటినీ బైటపెడుతున్నారు మంత్రులు.

వ్యక్తిగత కక్షలు, ఆఖరికి కుటుంబ కలహాలను కూడా రాజకీయ దాడులుగా చూపిస్తున్న టీడీపీకి అసెంబ్లీలోకే రుజువులు తీసుకొచ్చి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాలను ఎవరూ ఆపలేరు కాబట్టి ప్రజలకి విషయం అర్థమవుతోంది. ఎవరు దొంగలో, ఎలా రాష్ట్రాన్ని దోచుకున్నారో తెలుస్తోంది. ఇన్నాళ్లూ పచ్చమీడియా ఎంత కవరింగ్ చేసిందో అర్థంచేసుకుంటున్నారు జనం.

తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రస్తుతం వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలకు కూడా బాబు అనుకూల మీడియా ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఇంకొన్ని రోజులుపోతే ఈ రాతలు ఇంకా మారతాయి. బాబు అనుకూల మీడియాలోనే అతడు చేసిన అరాచకాలు చూడొచ్చు. అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు వైసీపీ నేతలు. 

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!