ఆంధ్రప్రదేశ్లో వివాదాస్పదమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్తో పాటు తిరుపతి జనసేన టికెట్ రేట్ తదితర అంశాలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ చట్టం తీసుకొచ్చిందే కేంద్రంలోని మోదీ సర్కార్ అన్నారు. ఆ యాక్ట్ గురించి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేసి, ఎన్డీఏలో భాగస్వామిగా వాస్తవాలు చెప్పాలని భూమన డిమాండ్ చేశారు.
తిరుపతి కొర్లగుంటలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనే సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇంత వరకూ ల్యాండ్ టైటిల్ చట్టంపై కనీసం ప్రాథమిక చర్చ కూడా సరిగా ప్రారంభం కాలేదన్నారు. కానీ జగన్ ఏదో చేస్తున్నాడంటూ చంద్రబాబు విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వంత పాడే పత్రికల్లో కూడా మరొక విషయమే లేనట్టు రాస్తున్నాయని భూమన మండిపడ్డారు.
గోతికాడ గుంట నక్క లా కూర్చుని అవకాశం దొరికితే ఏదంటే అది మాట్లాడడం చంద్రబాబు నైజం అని భూమన ధ్వజమెత్తారు. అలాగే పెన్షనర్ల ఇబ్బందులకు చంద్రబాబే కారణమన్నారు. పెన్షనర్ల పాపం చంద్రబాబుకు ఊరికే పోదని ఆయన హెచ్చరించారు. వలంటీర్లపై దుర్మార్గమైన ప్రచారం చేసి, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుతో ఇళ్ల వద్ద పంపిణీని అడ్డుకున్నారని విమర్శించారు. వృద్ధులంతా నరకయాతన పడుతున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు, పవన్కల్యాణ్పై సామాజిక పింఛన్దారులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు. జగన్పై కోపాన్ని వృద్ధులు, దివ్యాంగుల మీద తీర్చుకోవాలని ప్రతిపక్షాలు అనుకోవడం దుర్మార్గమన్నారు. ఓట్లు రావడం లేదని తెలిసి వాళ్లు మాట్లాడుతున్న మాటలను సమాజం గమనిస్తోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం, జనసేన దిగజారి పోయాయని భూమన విమర్శించారు. పవన్ కల్యాణ్ బజారు మనిషిలా రోజూ అసహ్య ప్రసంగాలు చేస్తున్నాడని తప్పు పట్టారు. పవన్ కల్యాణ్కు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. రాజకీయాలంటే అవతలి వాళ్లని తిట్టడమే అనుకుంటున్నాడని భూమన దెప్పి పొడిచారు. పవన్కు తగ్గట్టుగానే ఆయన పార్టీ నాయకులు, అనుచరులు, అభ్యర్థులు తయారయ్యారని భూమన విమర్శించారు. తిరుపతిలో 30 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆరణి శ్రీనివాసులుకు టికెట్ ఇచ్చారని భూమన విమర్శించారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు