వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?

రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దనగరం, తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒకవైపు రాష్ట్ర సచివాలయం, మరొకవైపు అమరవీరుల జ్యోతి.. అలాంటి కీలక స్థానంలో ఎవరి విగ్రహం ఉంటే బాగుంటుంది? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా…

రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్దనగరం, తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఒకవైపు రాష్ట్ర సచివాలయం, మరొకవైపు అమరవీరుల జ్యోతి.. అలాంటి కీలక స్థానంలో ఎవరి విగ్రహం ఉంటే బాగుంటుంది? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారుతోంది.

తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో.. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేయడం తప్పు అని, అయితే గియితే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. అయితే అసలు ఈ వివాదం ఇలా పుట్టడానికి అవకాశం కల్పించింది గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే కదా అనే వాదన కూడా తెరపైకి వస్తోంది.

కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకుంది. ఒక అద్భుతమైన సచివాలయ నిర్మాణం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. మిలిటరీ, ఆస్పత్రి భూముల మీద కూడా కన్నేసిన కేసీఆర్ చివరికి పాత సచివాలయ స్థలంలోనే ఉన్నవన్నీ కూలగొట్టించి ఇప్పుడు నిర్మాణం చేయించారు. అలాగే అమరవీరుల జ్యోతి కూడా పూర్తిగా ఆయన సర్కారు ఖాతాలోనే పడుతుంది. ఇన్నిచేసిన కేసీఆర్.. ఆ రెండింటి మధ్యలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని పనులకు అడ్డం అనే మిషమీద తొలగించారు. పనులు పూర్తయ్యాక తిరిగి ఏర్పాటుచేయలేదు. కనీసం తెలంగాణ తల్లిని కూడా ఏర్పాటు చేయలేదు.

ఎంతో ప్రైమ్ ఏరియా అయిన ఆ స్థలంలో భవిష్యత్తుల్లో తన విగ్రహమే వస్తే బాగుంటుందని కేసీఆర్ తలపోశారో ఏమో తెలియదు. మొత్తానికి స్థలం ఖాళీగా ఉంచారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు సచివాలయం వద్ద రాజీవ్ విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తుండగా.. భారాస ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అభ్యంతరం చెబుతున్నారు. తెలంగాణకు రాజీవ్ కు సంబంధం లేదని, అంతో ఇంతో సోనియా అయినా తెలంగాణ ఇచ్చింది కానీ.. రాజీవ్ విగ్రహం సరికాదని, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అంటున్నారు.

తెలంగాణ తల్లి మీద వారిలో అంత ప్రేమ ఉంటే.. కేసీఆర్ ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడిలా కొత్త సర్కారు ఒక నిర్ణయానికి వస్తున్నదంటే ఆ అవకాశం వారికి ఇచ్చింది కేసీఆరే కదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

9 Replies to “వారికి ఆ ఛాన్సిచ్చింది కేసీఆరే కదా?”

  1. విగ్రహ ప్రతిష్టాపనం అధికార నాశనం

    ఇకనైనా ప్రజాధనం ఖర్చు పెట్టి మానవ దొరల విగ్రహాలు పెట్టడం ఆపండి

  2. కేసిఆర్ ఉన్నా లేనట్టే, కేసిఆర్ విగ్రహం పెట్టేస్తే, పోయాకా పెడతారో లేదో అనుమానం లేకుండా సంతోషంగా పోతాడు కదా.

  3. పీవీ విగ్రహం ఎందుకు పెట్టకూడదు? ఆధునిక భారత పితామహుడు, తెలంగాణా కి చెందిన వాడు!

Comments are closed.