మండలిలో మంది బలం తగ్గే వేళయింది..!

మూడు రాజధానుల బిల్లు సహా.. కీలక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు పడింది ఏపీ శాసన మండలి. శాసన సభలో 151 సీట్ల భారీ మెజార్టీ సాధించినా, మండలిలో బలం లేకపోయే…

మూడు రాజధానుల బిల్లు సహా.. కీలక సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు పడింది ఏపీ శాసన మండలి. శాసన సభలో 151 సీట్ల భారీ మెజార్టీ సాధించినా, మండలిలో బలం లేకపోయే సరికి ఏకంగా దాన్ని రద్దు చేసి పారేస్తామంటూ సీఎం జగన్ అసహనంతోనో, ఆవేశంతోనో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికి కూడా మండలి చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా వైసీపీని ఇబ్బంది పెడుతూనే ఉంది. రాబోయే మే నెలతో ఆ ఇబ్బందులన్నీ పటాపంచలు కాబోతున్నాయి.

58 స్థానాల ఏపీ శాసన మండలిలో అధికార వైసీపీ బలం కేవలం 13, టీడీపీకి 29 మంది సభ్యులున్నారు. మిగతావి ఖాళీలు, ఇతరులకు దఖలు పడ్డాయి. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీలోకి, ఒకరు బీజేపీలోకి మారినా వారి మందబలం తగ్గలేదు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా వైసీపీ తరపున ఆరుగురు ఎన్నిక కాబోతున్నారు.

ఇక ఈ ఏడాది మే నెలతో స్థానిక కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ జోరు చూస్తుంటే కచ్చితంగా ఆ 11 స్థానాలు కూడా వైసీపీకే దక్కుతాయనే అంచనాలున్నాయి. అంటే మే నెలకల్లా టీడీపీ బలం తగ్గిపోవడంతో పాటు, పరిషత్ ఎన్నికలు పూర్తై, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వైసీపీ మెజార్టీ పెరుగుతుంది. అంటే అక్కడితో టీడీపీ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడుతుందన్న మాట.

ఇన్నాళ్లూ ఈ మంది బలం చూసే టీడీపీ ఎగిరెగిరి పడింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుని కొన్నాళ్లు హోల్డ్ లో పెట్టి వైసీపీ సహనాన్ని పరీక్షించింది. ఇప్పుడిక ఆ ఆటలకు అడ్డుకట్ట పడే రోజొచ్చింది.

151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా వైసీపీకి సంపూర్ణ విజయం సాకారం కాలేదు. రేపు స్థానిక ఎన్నికల కోటాలో వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచి మండలిలో అడుగు పెడితే.. అప్పుడే వైసీపీ విజయం సంపూర్ణం అవుతుంది.

మే తర్వాత మండలిలో టీడీపీ చెత్త రాజకీయాలకు చరమగీతం పాడతామంటున్నారు వైసీపీ నేతలు. చెత్త రాజకీయాలు ఆగడంతో పాటు జగన్ కోరుకున్న ప్రతిపాదనలు, కార్యక్రమాలన్నీ మే నెల తర్వాత చకచకా పట్టాలపైకి రావడం గ్యారెంటీ.

రైతు గొప్పతనమే ఇతివృత్తంగా శ్రీకారం సినిమా

ఆర్కే నాయుడు క్యారెక్ట‌ర్ ని ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు