‘దిల్’ మేనేజర్ కు.. థియేటర్ కు మధ్య రగడ!

విశాఖలో పేరున్న థియేటర్లు సంగం-శరత్ కు, ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సంస్థ మేనేజర్‌కు మధ్య గట్టి రగడ జరిగినట్లు బిజినెస్ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తోంది. దీని పూర్వా పరాలు ఇలా వున్నాయి. విశాఖలో…

విశాఖలో పేరున్న థియేటర్లు సంగం-శరత్ కు, ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సంస్థ మేనేజర్‌కు మధ్య గట్టి రగడ జరిగినట్లు బిజినెస్ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తోంది. దీని పూర్వా పరాలు ఇలా వున్నాయి. విశాఖలో సంగం శరత్ థియేటర్లు దశాబ్దాల కాలంగా పేరున్న థియేటర్లు. వాటిలో ఛత్రపతి సినిమాను స్పెషల్ షో వేయమని దిల్ రాజు సంస్థ మేనేజర్ అడిగినట్లు బోగట్టా. దానికి వాళ్లు నిరాకరించారట. స్పెషల్ ఆటలు వేస్తుంటే థియేటర్లు పాడవుతున్నాయని అందువల్ల వేయమని చెప్పినట్లు తెలుస్తోంది.

అలా అయితే మీ థియేటర్లకు సినిమాలు ఎలా వస్తాయో, ఎలా రన్ చేస్తారో చూస్తా అని దిల్ మేనేజర్ మాట జారడంతో ఇరు వర్గాల మధ్య మాట మాట వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ లోకల్ అయిన మా మీద రుబాబు చేస్తావా? అంటూ థియేటర్ యాజమాన్యం గట్టిగా అటాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మాట మాట పెరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

తరువాత దిల్ రాజు మేనేజర్ తనకు ప్రాణహాని వుందంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఈ పంచాయతీ మరింత ముదరడంతో పెద్దలు కొందరు కలుగచేసుకుని రాజీ చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఆఫీస్ విశాఖ మేనేజర్ మాట తీరు వల్ల అప్పుడప్పుడు ఇలాంటి వివాదాలు వస్తున్నాయని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు తెలిపాయి.

ఈ విషయమై దిల్ రాజును ప్రశ్నించగా, ఆ విషయం సెటిల్ అయిపోయిందని అన్నారు. థియేటర్లకు సినిమాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం, పండగ సినిమాలు ఇవ్వమని అనడం ఇవన్నీ ఎవరి వల్లా అయ్యేవి కాదని వివరించారు.

దిల్ రాజు విశాఖ ఆఫీసు మేనేజర్ శ్రీనును ప్రశ్నించగా, చిన్న విషయం అని, తామంతా రోజూ సరదాగా మాట్లాడుకుంటూనే వుంటామని, తాను ఓ మాట అన్నానని, వారు ఓ మాట అన్నారని అలా జరిగిందని, అంతా ఇప్పుడు సర్దుకుందని అన్నారు.