బీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!

బీజేపీకి 48 శాతం, ఆప్‌కు 42, కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు ప్ర‌స్తుతానికి వ‌చ్చాయి.

ఢిల్లీలో బీజేపీ, ఆప్ మ‌ధ్య పోరు హోరాహోరీని త‌ల‌పిస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. అధికారం ద‌క్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగ‌ర్ 36 ఉండాలి. ప్ర‌స్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటింది. బీజేపీ 42, ఆప్ 28, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్య‌త‌లో ఉన్నాయి. అయితే క్ష‌ణ‌క్ష‌ణానికి ఆధిక్య‌త‌లు మారుతున్నాయి. ఒక ద‌శ‌లో బీజేపీ 50, ఆప్ 19 స్థానాల్లో ఆధిక్య‌త‌లో క‌నిపించాయి.

ఆ త‌ర్వాత బీజేపీ 39, ఆప్ 31 స్థానాల్లో ఆధిక్య‌తో ఉన్నాయి. అయితే ఫ‌లితాల స‌ర‌ళిని చూస్తే బీజేపీ ఢిల్లీ పీఠాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌ని చెప్పొచ్చు. 27 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ అసెంబ్లీ పీఠాన్ని ద‌క్కించుకోనుంది.

ఢిల్లీలో ఆప్ ప‌దేళ్లుగా అధికారంలో వుంది. దేశ రాజ‌ధానిలో బీజేపీకి కేజ్రీవాల్ కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. ఎలాగైనా ఢిల్లీలో ఆప్‌ని మ‌ట్టి క‌రిపించాల‌ని బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా త‌దిత‌ర బీజేపీ అగ్ర‌నేత‌లు ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. ఫ‌లితాల్ని చూస్తే, బీజేపీ, ఆప్ మ‌ధ్య పోరు తీవ్ర‌స్థాయిలో జ‌రిగింద‌ని అర్థ‌మ‌వుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి స్వ‌ల్ప మెజార్టీతో ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లో త‌న స‌మీప బీజేపీ అభ్య‌ర్థి కంటే కేజ్రీవాల్ వెనుక‌బ‌డడం గ‌మ‌నార్హం. కానీ ఈవీఎం కౌంటింగ్‌లో నెమ్మ‌దిగా కేజ్రీవాల్ పుంజుకుంటున్నారు. అలాగే సిసోడియా త‌దిత‌ర ఆప్ ముఖ్య‌నేత‌లు ఇప్పుడిప్పుడే లీడ్‌లోకి రావ‌డం విశేషం. బీజేపీకి 48 శాతం, ఆప్‌కు 42, కాంగ్రెస్‌కు ఆరు శాతం ఓట్లు ప్ర‌స్తుతానికి వ‌చ్చాయి.

2 Replies to “బీజేపీ చేతికి ఢిల్లీ పీఠం!”

Comments are closed.