నెయ్యి చుక్కలో తుపాను ఓవర్ యాక్షన్! యాక్షన్ ఓవర్!!

నెయ్యి కల్తీ గురించి పోరాడడానికి పూర్తిస్థాయిలో సిద్ధం కండి. మధ్యే మధ్వే అనాలోచిత, ఆవేశపూరిత నాటకీయ వ్యవహారాలను కట్టిపెట్టండి.

తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారుచేసేందుకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వులతో కల్తీ జరిగిందనే దుమారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో చర్చనీయాంశం. జగన్ ప్రభుత్వ కాలంలో టీటీడీ బోర్డుల సారథులు పాల్పడిన దుర్మార్గపు వ్యవహారంగా దీని గురించి ప్రచారం జరుగుతున్నది. అయితే విశ్వవ్యాప్తంగా భక్తకోటికి ఆరాధ్యుడైన అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమలేశుడికి సంబంధించిన వ్యవహారం కావడం.. సర్వజనరంజక వివాదం కావడం రాజకీయనాయకులకు లడ్డూలా దొరికింది. ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. అధికార కూటమి వారే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పాపులెవరో తేల్చేదాకా విచారణ జరిపించాలంటూ ప్రభుత్వంలోని పెద్దలే రంకెలేయడమే తమాషా!

అసలు కల్తీ ఏం, ఎలా జరిగిందని నివేదకల్లో ఉన్నదో తెలియదు గానీ.. పందికొవ్వు, గొడ్డుకొవ్వు కలిపేసినట్టుగా నిందల్ని కూడా ఫ్యాబ్రికేట్ చేయడంలో చంద్రబాబునాయుడు తొలి సక్సెస్ సాధించారు. తెలియకుండా గొడ్డు మాంసం తిన్నందుకు చేయవలసిన ప్రాయశ్చిత్తంగా పరాశర స్మృతి ప్రస్తావించే దీక్షను 11 రోజుల పాటు తాను ఆచరించడం ద్వారా పవన్ కల్యాణ్ మరింత ఎక్కువ మైలేజీ కోరుకున్నారు. అంటే ఓవర్ యాక్షన్ కు దిగారన్నమాట!

ఇప్పుడు దీక్ష పూర్తయింది. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ వెల్లడి కూడా పూర్తయింది. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన నిర్దిష్ట వ్యవస్థలు కావాలనే డిమాండ్ల వ్యక్తీకరణ కూడా ముగిసింది. అనగా, ‘ఓవర్ యాక్షన్’ తరువాత.. ‘యాక్షన్ ఓవర్’ అయిందన్నమాట. పవన్ కల్యాణ్ ఈ వారాహి సభాపర్వం తరువాత ఇక అడపాదడపా మాత్రమే స్పందించవచ్చు. రాజకీయ నాయకుల్లో అవసరానికి మించిన స్పందనల తీరులను ప్రస్తావించడమే, అందుకు తిరుమల దేవుడిని, లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవడాన్ని నిరసించడమే ఈ వారం గ్రేట్ఆంధ్ర కవర్ స్టోరీ ‘నెయ్యిచుక్కలో తుపాను- ఓవర్ యాక్షన్! యాక్షన్ ఓవర్!!’

తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం జంతు వ్యర్థాలతో, కొవ్వులతో కల్తీ కావడం అనేది ఎవ్వరూ సహించలేరు. ఈ దుర్మార్గం జరిగి ఉంటే గనుక.. ఖచ్చితంగా దోషులను శిక్షించే తీరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీకి బాధ్యత వహించాలన్నట్టుగా రాజకీయ విమర్శలు వెల్లువలా రావొచ్చు గానీ.. కరడుగట్టిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా తప్పు, దోషులు తేలితే ఉపేక్షించాలని అనుకోరు. కల్తీగా గుర్తించిన నెయ్యిని అసలు లడ్డూ తయారీకి వాడారో లేదో కూడా తేలలేదు. అది తేలేదాకా జగన్ వ్యతిరేక నాయకులు మాత్రం తాళలేకపోతున్నారు. ‘ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ సాధ్యంకాదు’ అనే పాపులర్ నానుడికి కార్యరూపం ఇస్తున్నారు. జగన్ ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ఇంతకంటె గొప్పఅవకాశం మరెన్నటికీ రాబోదు అనే ఆలోచన అటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను, వారి అనుచర దళాలను పురిగొల్పుతున్నది.

నిరాధార నిందల జ్వాలలకు చంద్రబాబునాయుడు అగ్గిపుల్ల గీసి మంట రాజేస్తే.. పవన్ కల్యాణ్ తన ముద్రగల వ్యవహారాలతో ఆజ్యం జత చేస్తున్నారు. తప్పు జరిగిందో లేదో తేలకముందే.. వివాదాన్ని దావానలంలా మార్చడానికి వీరంతా పరితపించిపోతున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ 11 రోజుల ఎపిసోడ్ నడిపించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అంతా అయిన తర్వాత.. అతి కష్టమ్మీద ఆపసోపాలు పడుతూ కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన క్రిస్టియన్ కూతురుతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి మరీ దైవదర్శనం చేసుకున్నారు. తిరుపతిలో సభ పెట్టి, దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు తన డిక్లరేషన్ ను వారాహి పేరుతో ప్రకటించారు.

పవన్ మరియు ఒక ఫ్యాషనబుల్ మాట!

‘నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధం’ ఈ మాట చాలా నాటకీయంగా ఉంటుంది. నిజంగా ప్రాణభయం ఉన్నవారు.. లేదా, ఎవరైనా ఇలాంటి మాట అంటే వారి సాహసానికి ముచ్చట వేస్తుంది. తన ప్రాణాలకు ఇతరులు హాని తలపెట్టగల స్థాయిలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే వారు, పోరాటాలు చేసేవారు, ఉద్యమకారులు ఇలాంటి మాట చెబితే బాగుంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఈ కేటగిరీలకు చెందిన వారు కానే కాదు. ఆయన ఒక సాధారణ రాజకీయ నాయకుడు. చిత్రమైన సంగతి ఏంటంటే.. ఆయన తాను ఏం చేస్తే అది పెద్ద ఉద్యమం అని తిరుగుబాటు అని భ్రమిస్తారు. తనను ఎవరైనా చంపాలని అనుకునేంత పెద్ద పోరాటం, ఉద్యమం తాను చేస్తున్నాననే ఊహల్లో ఆయన ఉంటారు.

‘నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధం’ అనేది ఆయనకు అలవాటైనటువంటి మాట. ఆయన ఏ పనిచేసినా సరే.. సీజనును బట్టి.. దానికి కాస్త ఎమోషన్ జోడించడానికి ఈ మాట వాడేస్తూ ఉంటారు. ఎన్నికల ప్రచార సమయంలో.. పార్టీని పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయడానికి కష్టపడుతున్న రోజుల్లో దాదాపుగా ప్రతి బహిరంగ సభలో కూడా.. పవన్ కల్యాణ్ ‘నా ప్రాణాల్ని బలిపెట్టడానికి సిద్ధం’ అనే మాట వాడేవారు. ఇంతకూ ఆయన ప్రాణాలు బలి ఎవరికి కావాలి? అనేది బహుశా ఆయనకే క్లారిటీ లేని సంగతి. ఇప్పుడు సనాతనధర్మం అనే మాటకు పాపులారిటీ తీసుకువచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఇతర మతాల పట్ల విషం కక్కే వారికి కూడా ఈ దేశంలో ప్రాణభయం లేదు.

ముస్లిముల మీద విషం కక్కే హిందు దురహంకారులు, హిందువుల మీద ద్వేషాన్ని వ్యాపింపజేయడమే తమ జీవిత లక్ష్యంగా భావించి ప్రచారం చేస్తూ ఉండే ముస్లిందుష్టులు.. వీరిని మించి హిందూదేవుళ్లను నీచంగా అవమానించడం ద్వారా మాత్రమే తమ వ్యాప్తి జరుగుతుందని భావించే క్రిస్టియన్లు ఇలాంటి పెక్కు రకాల మంది ఈ లౌకిక దేశంలో పుష్కలంగా ఉన్నారు. వారెవ్వరికీ కూడా ప్రాణభయం ఏర్పడలేదు. ఒక మతం గురించి మరొకరు నీచమైన దుడుకు వ్యాఖ్యలు చేసినప్పుడు ‘వారి తల తెస్తే బహుమతులు ఇస్తా’ వంటి ప్రకటనలు మనకు ఉన్నాయి గానీ.. అవి హత్యలుగా పరిణమించిన ఉదాహరణలు మనకు లేవు. అంతటి తీవ్రమైన వ్యవహారాలకే ఈ దేశంలో ప్రాణహాని లేనప్పుడు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయోజనాల లక్ష్యంతో మాట్లాడే మాటలకు ప్రాణహాని ఉంటుందని అనుకోవడం పెద్ద కామెడీ!

మొన్న ప్రజల సమస్యల కోసం, నిన్న జగన్ పాలన నుంచి ప్రజలను కాపాడడం కోసం, ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. ఇలా చీటికీ మాటికీ ప్రాణాలు బలివ్వడానికి సిద్ధం అని పవన్ చెబుతూ ఉంటే ఆ మాటల్లో ఫోర్స్ పెరుగుతుందని ఆయన అనుకుంటుండవచ్చు గానీ.. ప్రజల దృష్టిలో అవి కామెడీ అవుతున్నాయి.

రెండు పడవలపై కాళ్లు పెట్టినట్టే..

పవన్ కల్యాణ్ ఇప్పుడు సాధారణ సినిమా హీరో కాదు. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ‘మీకోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధం’ అని మాట ఇచ్చి మరీ ప్రజాసేవలోకి వచ్చిన నాయకుడు. ఇప్పుడు.. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ‘నా రాజకీయ హోదాను, పదవిని అధికారాల్నే కాదు.. నా ప్రాణాల్నీ కోల్పోవడానికి సిద్ధం’ అని ఆయన చెబుతున్నారు. ఈ త్యాగబుద్ధి అంత ఈజీగా రాగలిగేది కాదు.

హిందూ ధర్మం పట్ల ఆయనకు చిత్తశుద్ధితో కూడిన భక్తిప్రపత్తులు, విశ్వాసం ఉండబట్టే వచ్చిందని అనుకుందాం. కానీ ఆయన ప్రధానంగా గుర్తించాల్సినది ఏంటంటే.. సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం బిగించడం అనేది ఒక కేటగిరీ పని. ప్రజాజీవితంలో ఉంటూ రాజకీయాధికారం వెలగబెడుతూ ఉండడం ఇంకో కేటగిరీ పని! రెండూ జమిలిగా చేస్తానంటే.. రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం సాగించినట్టే ఉంటుంది.

ధర్మాన్ని కాపాడడం అంటే ఇదేనా?

జగన్ పాలన కాలంలో హిందూ ఆలయాల పట్ల ఎక్కడెక్కడ ఏయే అపచారాలు జరిగాయో వాటన్నింటినీ కూడా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాముడి విగ్రహాన్ని తల తీసేయడం దగ్గరినుంచి, రథం తగులబెట్టడం, ఇత్యాది ఘటనలన్నీ ఉదాహరించారు. ఇప్పుడు నెయ్యి కల్తీ సరే సరి. అది ఆయన పోరాటాల్లో పాశుపతాస్త్రం వంటిది. హిందూత్వం పట్ల ఇలాంటి అపచారాలు జరిగినప్పుడు వాటి మీద పోరాడడం అవసరమే. లేకపోతే.. అలాంటి దుర్మార్గాలు చేసేవారికి తెగింపు వచ్చేస్తుంది. వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయం పాలకుల్లో కూడా పుట్టాలి. కాబట్టి ఈ పోరాటస్ఫూర్తి అవసరమే. అందుకు కంకణ బద్ధం అవుతున్నందుకు పవన్ కల్యాణ్ ను అభినందించాల్సిందే. అయితే సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఇదేనా? అలా అని సరిపెట్టుకుంటే ఆత్మవంచన.

ధర్మాన్ని కాపాడడం అంటే రాముడి తల తెగినప్పుడు, తిరుమల లడ్డూలో పందికొవ్వు కలిసిందని తెలిసినప్పుడు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం, ఆవేశంగా విమర్శలు చేయడం మాత్రమే కాదు. ఒక్క పవన్ కల్యాణ్ కు ఇది పరిమితం కాకూడదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కోట్లాది మంది హిందువులు తమ నిరసనను, అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కగల స్ఫూర్తిని, చైతన్యాన్ని వారిలో తీసుకురాగలిగినప్పుడే అది ధర్మాన్ని కాపాడడం అవుతుంది. అలాంటి పవన్ ఏంచేశారు? ఏం చేస్తున్నారు? తానొక్కడూ దీక్ష చేస్తున్నా అనే బదులుగా.. రాష్ట్రంలో ఉన్న హిందువులు, తిరుమలేశుని భక్తులు, సనాతన ధర్మాచరణ పట్ల శ్రద్ధ ఉన్నవారందరూ ఒకరోజు దీక్ష చేసేలా ఏదైనా పిలుపు ఇచ్చి ఉంటే.. అది ఇంకా భేషుగ్గా ఉండేది.

నిజం చెప్పాలంటే.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇతర పార్టీల నాయకులకు కూడా రెడ్ కార్పెట్ వేస్తూ విస్తరిస్తున్న జనసేనకు కూడా లాభం జరిగేది. ఇలాంటి బృహత్ ప్రజా కార్యక్రమం వల్ల పార్టీ ఇమేజి రాష్ట్రవ్యాప్తంగా పెరిగేది. పవన్ కల్యాణ్ కు జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడం, ఆయన మీద నింద వేయడంలో ఉండే ఆసక్తి.. తన పార్టీని బలోపేతం చేసుకోవడం మీద లేదు. అలాఅంటే నాకు రాజకీయం అక్కర్లేదు.. సనాతన ధర్మ పరిరక్షణే ముఖ్యం అని నాటకీయ డైలాగులు వల్లించగలరు ఆయన!

ఇది రాజకీయ ప్రసంగం కాదా?

తాను కేవలం సనాతన ధర్మానికి జరుగుతున్న ద్రోహం గురించి మాట్లాడడానికి మాత్రమే తిరుమలకు వచ్చానని పవన్ చెప్పుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా రాలేదని, ధర్మపరిరక్షకుడిగా మాత్రమే వచ్చానని కూడా చెప్పుకున్నారు. తప్పు గురించి విచారణ చేయమని అడుగుతోంటే రాజకీయం అంటున్నారని నిందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని చెప్పిన వారిపై పోరాడడానికే ఇక్కడకు వచ్చానని కూడా పవన్ చెప్పుకున్నారు. ఇదంతా బాగుంది. ఆ చిత్తశుద్ధికి ఆయనను అభినందించాలి. ఆయన ఆ దీక్షను చాలా శ్రద్ధగా, స్మృతులు ఎలా చెబుతున్నాయో అలా నిష్టగా పాటించారు. అందుకు కూడా అభినందించాలి.

కానీ, వారాహి డిక్లరేషన్ ప్రకటించదలచుకున్న ఈ వేదికమీదినుంచి జగన్ మీద ఇతర విమర్శలు ఎందుకు? ఒకవైపు జగన్ తన చేత్తో పోటులో కల్తీ నెయ్యివేసి లడ్డూలు చేశారని తాను అనడం లేదని అంటారు. వాళ్లు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేస్తారు. మరోవైపు అసలు నెయ్యి వ్యవహారానికి సంబంధం లేకుండా.. ‘జగన్ అమాయకుడు సుద్దపూసేమీ కాదు. ఆయనపై మోసం, నేరపూరిత విశ్వాసఘాతుకం, అధికార దుర్వినియోగం వంటి 29 కేసులు ఉన్నాయని’ అంటారు. అవన్నీ నిజమే కావొచ్చు. కేసులు అంతకంటె ఎక్కువే కూడా ఉండొచ్చు. కానీ.. వాటి ప్రస్తావన కారణంగా సనాతన ధర్మం పట్ల వేదికమీదినుంచి పవన్ ప్రదర్శించిన పోరాట పటిమ పలుచబడిపోవడం లేదా? అనేది గమనించాలి.

ఇలాంటి డిమాండ్ ఒక్కరైనా చేశారా?

జగన్ ప్రభుత్వ కాలంలోని టీటీడీ బోర్డు సారథులు, ఏఆర్ డెయిరీ వారితో కుమ్మక్కు అయి.. వారికి కాంట్రాక్టు కట్టబెట్టడానికే నిబంధనలు పూర్తిగా మార్చి లాలూచీ పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఏఆర్ డెయిరీకి అంత సామర్థ్యం లేకపోయినప్పటికీ కాంట్రాక్టు దక్కించుకున్నదనీ.. ఇతర డెయిరీల నుంచి నెయ్యిని ట్యాంకర్లలో కొనుగోలు చేసి.. తమ వద్దకు తెప్పించుకుని అక్కడ బాగా కల్తీ చేసి ఆ తర్వాత తిరుమలకు సరఫరా చేసిందనేది ఆనం వెంకటరమణా రెడ్డి వంటి వారు పదేపదే చేస్తున్న ఆరోపణ.

కేవలం ఒకే నెంబరు గల ట్యాంకరు ద్వారా, వేర్వేరు వే బిల్లులతో రవాణా జరిగిందనే మాట పట్టుకుని ఆయన అనేక నిందలు వేస్తున్నారు. అయితే కనీస లాజికల్ స్పృహతో ప్రాథమికంగా కొన్ని వాస్తవాలు నిగ్గుతేల్చాలని ఎవ్వరూ అడగడం లేదు. నెయ్యి ట్యాంకర్లు అంటే నీళ్లు, పాల ట్యాంకర్ల లాగా విస్తృతంగా అద్దెకు లభించేవి కాదు. తక్కువ ఉంటాయి కాబట్టి.. ఒకే నెంబరు గల వాహనం.. వేర్వేరు డెయిరీల కోసం పనిచేసి ఉండొచ్చు. ఆ కారణంగా నింద వేయడం సరికాదు. కానీ ఏఆర్ డెయిరీ తప్పును ప్రాథమికంగా తేల్చడానికి ఒక అవకాశం ఉంది.

కాంట్రాక్టు పొందిన నాటినుంచి ఏఆర్ డెయిరీ ఆఫీసు రికార్డుల ప్రకారం వారు రోజువారీ ఎన్ని లక్షల లీటర్ల పాలను సేకరించేవారు.. రోజువారీ వారి నెయ్యి ఉత్పాదక సామర్థ్యం ఎంత? వంటివి వారి యూనిట్ లోనే ఉండే రికార్డుల్లో స్పష్టంగానే దొరుకుతాయి. ఆదిశగా దృష్టి సారించి పరిశీలిన జరిపితే గనుక.. ఒక్కరోజు వ్యవధిలోనే.. ఆ డెయిరీ సామర్థ్యం లేకుండానే మానిప్యులేట్ చేసిందో లేదో తేలిపోతుంది. కానీ అలాంటి డిమాండ్ ఏ పార్టీ వారు కూడా వినిపించడం లేదు. తప్పు తేలడం, మూలమెక్కడున్నదో కనిపెట్టి దానికి పరిష్కారం కనుగొనడం ఈ నాయకుల లక్ష్యం కానే కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే వారికి కావాలి. పైకి మాత్రం.. ‘అబ్బెబ్బే రాజకీయమా కానే కాదు.. కేవలం దేవుడికోసం, ధర్మం కోసం..’ అని మాయమాటలు పలకాలి!

చట్టం ఏం చెబుతోంది?

ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజమనే అనుకుందాం. ప్రస్తుతానికి సుప్రీం కోర్టు అయిదుగురితో ఒక స్వతంత్ర సిట్ ను ఏర్పాటు చేయడానికి ఆదేశించింది. ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీస్, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికార్లతో ఈ సిట్ ఉంటుంది. దీనిని సీబీఐ డైరక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఏం జరిగింది? ఎంత మేర తప్పు జరిగింది? అనే సంగతులు వారు తేల్చడానికి ఇంకా కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. దేవుడి పట్ల ఎంత అపచారం జరిగిందో, భక్తుల పట్ల ఎంత ద్రోహం జరిగిందో అప్పటికి తేలుతుంది.

అయితే ప్రభుత్వం చెబుతున్న ఆరోపణలన్నీ నిజమే అని తేలినట్టే భావించినప్పటికీ.. జరిగిన నేరం ఏమిటని అనుకోవాలి? నెయ్యిని కల్తీ చేయడం మాత్రమే. ఆహార పదార్థాల కల్తీకి మన దేశంలో ఉన్న చట్టాలు ఏం చెబుతున్నాయి? ఏం శిక్షలు వేస్తున్నాయి? మనకు అవగాహన ఉందా?

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 272 నుంచి 278 వరకు ఆహార పదార్థాలు, పానీయాల కల్తీకి సంబంధించిన సంగతులను చర్చిస్తాయి. ఈ సెక్షన్ల కింద ఒక వ్యక్తి కల్తీకి పాల్నడినట్టు తేలితే.. అతనికి గరిష్టంగా ఆరునెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దానితోపాటు వెయ్యిరూపాయల జరిమానా కూడా విధించవచ్చు. ఈ రెండూ కలిపి విధించడానికి కూడా అవకాశం ఉంది.

అంతే తప్ప, కల్తీ చేసినది తిరుమల దేవుడి ప్రసాదానికి వాడే నెయ్యి గనుక దానికి ప్రత్యేకమైన పీనల్ కోడ్ సెక్షన్లు ఉండవు. అంతగా కావలిస్తే మత విశ్వాసాలను దెబ్బతీయడం, మనోభావాలను గాయపరచడం వంటి అభియోగాలకు సంబంధించిన సెక్షన్లు కూడా బనాయించవచ్చు. కానీ దోషి (ఎవరో తేలితే) వారి తరఫు న్యాయవాది అలాంటి కల్తీ జరగడానికి కేవలం వ్యాపారంలో లాభార్జనే తప్ప మరొక ఉద్దేశం లేదని వాదిస్తే ఆ సెక్షన్లు కూడా నిలవకపోవచ్చు.

మరి ఈ నేరం నిజమే అనుకున్నప్పుడు.. ఇంత పెద్ద దైవద్రోహానికి పాల్పడిన వ్యక్తిని ఏ రకంగా శిక్షించగలమని పవన్ కల్యాణ్ లేదా చంద్రబాబు అనుకుంటున్నారో తెలియదు. మహా అయితే ఏఆర్ డెయిరీ వారిని బ్లాక్ లిస్టులో పెట్టించగలరు. ఈ ద్రోహానికి ఈ శిక్ష సరిపోతుందా? చాలదు గాక చాలదు. ఏతావతా చెప్పొచ్చేదేంటంటే.. చట్టం, రాజ్యాంగం ప్రకారం నడిచే కోర్టులు ఇలాంటి దైవద్రోహం చేసిన వ్యక్తిని ఆరునెలలకు విడిచిపెట్టవచ్చు గాక! కానీ తిరుమల దేవుడు వదలిపెట్టడు. తిరుమల క్షేత్రంలో తప్పులు చేసే వారు సాధారణంగా స్వామివారి నేత్రదర్శనం రోజుగా భావించే గురువారం నాడు పట్టుబడుతుంటారు. వారికి శిక్షలు పడుతుంటాయి. దేవుడి పట్ల విశ్వాసం భక్తుల్లో పెరుగుతూ ఉంటుంది.

అంటే, తనపట్ల అపచారం చేసిన, తన భక్తులను వంచించిన ద్రోహికి ఎలాంటి శిక్ష వేయాలో దేవుడు నిర్ణయించుకోగలడు. ఆరునెలల జైలుకు మించి శిక్షించే వెసులుబాటు లేని కోర్టుల శిక్షలతో ఆయనకు నిమిత్తం లేదు. ఆయన కోర్టులో అలాంటి తప్పు చేసిన వాడికి ప్రత్యేకమైన దండన ఉంటుంది. కాబట్టి.. జరిగిన అపచారానికి సంబంధించి చంద్రబాబు వంటి రాజకీయ నాయకులు, పవన్ కల్యాణ్ వంటి సదాచార, సనాతన ధర్మాచార పరాయణులు దుఃఖించాల్సిన అవసరం లేదు. కానీ.. వారు తమ బాధ్యతలను గుర్తెరిగి స్పష్టతతో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

పవన్.. అసలు మీ పని మీరు చేస్తున్నారా?

పవన్ కల్యాణ్ గారూ..! దేవుడి ప్రసాదంలో కల్తీ జరిగితే ఆ సంగతి దేవుడు చూసుకోగలడు! దోషుల్ని ఎలా శిక్షించాలో ఆయనకు తెలుసు. కానీ ఈ దేశంలో లేదా తమ పరిపాలన సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ జరుగుతున్నది (ఆరోపణలన్నీ నిజమే అనుకుంటే గనుక) కేవలం తిరుమల లడ్డూ మాత్రమే కాదని మీకు తెలుసా? రాష్ట్రంలో ఎన్ని రకాల కల్తీలు ప్రజల జీవితాలను ప్రమాదం అంచుకు ప్రతిరోజూ కొద్దికొద్దిగా నెడుతున్నాయో మీకు తెలుసా? మీరు హిందూ మతం కోసం, సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం మఠం పెట్టుకున్న మతపెద్ద, పీఠాధిపతి కానే కాదు. కొన్ని కోట్ల మంది ప్రజలు మీ పరిపాలన సామర్థ్యం మీద విశ్వాసంతో ఓట్లు వేస్తే ఈ రాష్ట్రానికి మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. జస్ట్ దేవుడి పట్ల జరిగే అపచారాల గురించి ఆలోచించడం కాదు… ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆలోచించడం.. పరితపించడం మీ ప్రాథమిక విధి. మీరు దానిని శుభ్రంగా నిర్వర్తిస్తున్నారా?

సాక్షాత్తూ తిరుమల దేవుడి ప్రసాదాలకు వాడే దినుసులే కల్తీ అయిపోతున్నాయి.. మరి ఏ విశేషమూ లేని ప్రజల జీవితాలతో ఇలాంటి కల్తీలకు పాల్పడే దుర్మార్గులు ఎన్ని రకాలుగా ఆడుకుంటున్నారో గుర్తించే ప్రయత్నం చేయబోతున్నారా? లేదా?

తిరుమల తిరుపతి దేవస్థానాల వద్ద, వారికి సరఫరా అయ్యే దినుసుల నాణ్యతను పరీక్షించడానికి ఎంతో ఆధునాతనమైన ల్యాబ్ లు ఉంటాయి. అయినా సరే కల్తీ జరిగిందని అనుకుంటున్నాం. మరి అలాంటి పరీక్షల ఏర్పాటు, ల్యాబ్ ల వ్యవస్థ అణువంత కూడా లేని అనాథ బతుకులుగా రాష్ట్రంలోని కోట్లమంది ప్రజలు బతుకుతున్నారు. వారందరికీ మీరు పరిపాలకులు. వారికోసం మీరు ఏం చేస్తున్నారు?

దుకాణాల్లో అమ్మే సరుకుల్లో, పొడుల్లో, నూనెల్లో నాణ్యత ప్రమాణాల గురించి మీరు ఎంత తరచుగా తనిఖీలు చేయడం గురించి ఉత్తర్వులు ఇస్తున్నారు? హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం వంటల్లో నాణ్యతలను ర్యాండమ్ గా తనిఖీ చేయడానికి మీరు అమల్లో పెట్టిన ఏర్పాట్లు ఏమిటి? రోడ్ల మీద, ప్లాట్ఫారమ్మీద దుకాణాల్లో బజ్జీలు, చికెన్ పకోడీలు నానా రకాల తినుబండారాలు అత్యంత చవకధరలకు లభ్యమవుతూ ఉంటాయి. కుళ్లిన, చెడిన మాంసం, చికెన్ ఉత్పత్తులే రోడ్ల మీదికి చేరుతుంటాయని, ఒకసారి వాడి వదిలేసిన అనారోగ్యకారకమైన నూనెలే రోడ్లమీది చాలా దుకాణాలకు చేరుతుంటాయని అనేక ఆరోపణలు వినిపిస్తుంటాయి.

ఇలాంటి వాటి నియంత్రణకు మీరు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? లేదా? ఐస్ క్రీమ్ లు, ఐస్ లు, వంటకు వినియోగించే పొడులు ఇలాంటి అనేకం దారుణంగా కల్తీ అవుతున్న సమాజం మనది. ఊర్లలో చిన్న చిన్న డెన్ లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారులు కూడా చిరు కల్తీలకు పాల్పడుతూ ప్రజలకు పెనుప్రమాదాలను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి మీరు ఏం చేయబోతున్నారో చెప్పగలరా? దేవుది ప్రసాదం కల్తీ ఉదాహరణతో మేలుకుని, ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలను తీసుకోకపోతే గనుక.. మీరు మిమ్మల్ని గెలిపించిన రాష్ట్రప్రజలకు ద్రోహం చేస్తున్నట్టే లెక్క!

ప్రజారోగ్యాన్ని ధ్వంసం చేసే ఇలాంటి కల్తీ కారకులకు వెన్నులో భయం పుట్టేలా చట్టాలను సవరించాలనే ఆలోచన మీకు ఉన్నదా లేదా? ఆరునెలల జైలు, వెయ్యి రూపాయల జరిమానా వంటి తూతూమంత్రం శిక్షలు కల్తీ దారుణాలకు, ఆర్జనలకు అలవాటు పడిన వారిలో మార్పుతెస్తాయని మీరు నమ్ముతున్నారా? పవన్ కల్యాణ్ గారూ.. సమాధానం చెప్పాలి.

దేవుడి ద్రోహుల గురించి ఆలోచించగల శక్తి దేవదేవుడికి తప్పకుండా ఉంటుంది. కానీ అమాయకులు, అభాగ్యులు, గతిలేని వారు అయిన ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం పాలకులు అయిన మీదే. ఇంటగెలిచి రచ్చ గెలవాలి అనే సామెత చందంగా.. ముందు మీ పని మీరు చేయండి. రాష్ట్రంలో కల్తీలకు పాల్పడే సకల దుర్మార్గాలను పూర్తిగా అరికట్టి, అలాంటి వారిని వణికించే కొత్త చట్టాలకు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని కాపాడండి. ప్రజల పట్ల మీ చిత్తశుద్ధిని, కార్యదీక్షతను ముందు నిరూపించుకోండి. ఆ తర్వాత దేవుడి వద్దకు రండి. ఆ తర్వాత సనాతన ధర్మ ప్రస్తావన తీసుకురండి.

‘కాదూ కూడదూ.. నాకు సనాతన ధర్మమే ముఖ్యం.. ప్రజలు ఎలా చచ్చినా పరవాలేదు, పట్టింపులేదు’ అనుకునేట్లయితే గనుక- అభ్యంతరం లేదు. మీ త్యాగనిరతి, పదవులు, హోదాల పట్ల మీకు మమకారం లేదనే సంగతి ప్రజలకు నిరూపిస్తూ.. పూర్తిగా వాటిని వదిలేసి ధర్మం కోసం పోరాటం చేయడానికి.. నెయ్యి కల్తీ గురించి పోరాడడానికి పూర్తిస్థాయిలో సిద్ధం కండి. మధ్యే మధ్వే అనాలోచిత, ఆవేశపూరిత నాటకీయ వ్యవహారాలను కట్టిపెట్టండి.

ధర్మో రక్షతి రక్షితః – ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది!

ప్రజా రక్షతి రక్షితః – ప్రజల్ని కాపాడండి.. ఆ ప్రజలే మిమ్మల్ని కాపాడుతుంటారు!!

..ఎల్ విజయలక్ష్మి

34 Replies to “నెయ్యి చుక్కలో తుపాను ఓవర్ యాక్షన్! యాక్షన్ ఓవర్!!”

  1. ///దెముడి ప్రసాదం లొ కల్తీ జరిగితె ఆ విషయం దెముడు చూసుకొగలడు///

    .

    ఈమె చెప్పెది చూస్తుంటె…. మీరు అనవసరం గా అప్పటి TTD ని, అప్పటి EO ని నిందిస్తున్నారు, ఎటూ దెముడు శిక్షిస్తాడు కదా లైట్ చెస్కొండి అన్నట్తు రాస్తుంది. జగన్ కి ఎక్కడ నష్టం కలుగుతుందొ అన్నది ఈమె భాద!

    అన్ని స్వయం గా దెముడె చూసుకుంటె, ఇక ఈ చట్టలు, న్యాయస్టానాలు ఎందుకు?

    రెపు జగన్ కెసులు లలొ కూడా ఆ దెముడె చూసుకుంటాడులె, విచారణ ఎందుకు అంటారా?

  2. ఇది ఆహార కల్తీ అని నువ్వు చెప్పినా, కోర్టు లో అలాగే నిరూపణ అయినా, శిక్ష కూడా ఆహార కల్తీ అని వేసినా…

    అసలు విషయం ఎవరికి చేరాలో వాళ్లకి చేరుతుంది, దాని పర్యావసానం కూడా బాగానే ఉంటుంది.

    ఆపైన ఖర్మసాక్షి ఒకటి వుంది. తప్పు చేసిన వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురుచూడండి పార్టీ లకి అతీతంగా

  3. Pawan Kalyan garu meku eppudu buddi vastundo naku ardam kavatlaedu.puri Jagannath garu cheppina matalu vinandi.meku eppatikanna ardam kavali.mana help chesina,evarikosamo manam poradina ardam chesukune vallu Asalu vundaru.happy ga manchiga mekunna facilities enjoy cheyandi.evadu ekkada chusthe manakenduku.intha manditho ela tittlu tinala,anipinchukovala.nenu matram Evariki help cheyanu.vammo vellundarini choostunte,pichi vastundi.manakosam manam brathakatame correct.meku evanni eppatiki ardam avutundo.

  4. లక్ష కిలోలు ఆర్డర్ వున్న సంస్థ కి సొంత ట్యాంకర్స్ ఉండవా అన్నది నా పీత బుర్రకి వచ్చిన అనుమానం

    ఆహార కల్తీ కన్నా వ్యవస్థ లని పూర్తిగా కల్తీ చేసి బ్రష్టు పట్టించాడు అన్నియ….దాని సంగతి సూడు లచ్చక్క

  5. లక్ష కిలోలు ఆర్డర్ వున్న సంస్థ కి సొంత ట్యాంకర్స్ ఉండవా అన్నది నా పీత బుర్రకి వచ్చిన అనుమానం

    ఆహార కల్తీ కన్నా వ్యవస్థ లని పూర్తిగా కల్తీ చేసి బ్ర.ష్టు పట్టించాడు అ.న్నియ…

    దాని సంగతి సూడు లచ్చి అక్కియా

  6. లక్ష కిలోలు ఆర్డర్ వున్న సంస్థ కి సొంత ట్యాంకర్స్ ఉండవా అన్నది నా పీ.త బుర్రకి వచ్చిన అనుమానం

    ఆ.హార కల్తీ కన్నా వ్యవస్థ లని పూర్తిగా క.ల్తీ చేసి బ్రష్టు పట్టించాడు అ.న్నియ…

  7. కడుమంట తో కళ్ళు మూసుకుపోయి pawan kalyan గారి మీద విషం కక్కడం తప్ప….ఆయన చేస్తున్న మంచి మీకు కనిపించదు…. చూడాలని కూడా మీకు లేదు….నిన్న ఒక్క రోజు పవన్ ఎంత మంది సామాన్య ప్రజలను, నాయకులను కలిసి వాళ్ళ సమస్యలు విన్నాడో ఈ 5yrs మొత్తం కలిపినా మన అన్నయ్య అంతమందిని కలిసివుండడు…..

  8. హిందువులు అకలితొ చస్తారెమొ కాని బీఫ్ తీరు

    ఈ లుచ్చా వెదవెమొ ..నాకు ప్రాణాలు లెక్కలెదు అంటాడు ..అకలెస్తె ఎది దొరకకపొతె బీఫ్ తింటా అంటాడు..

    వీడు సనాతన దర్మ పరిరక్షకుడు ..ఎమంటారు ..పిల్ల పూక్ సైనిక్స్

  9. హిందువులు అకలితొ చ..స్తారెమొ కాని బీ..ఫ్ తీరు

    ఈ లు..చ్చా వెదవెమొ ..నాకు ప్రాణాలు లెక్కలెదు అంటాడు ..అకలెస్తె ఎది దొరకకపొతె బీ..ఫ్ తింటా అంటాడు..

    వీడు సనాతన దర్మ పరిరక్షకుడు ..ఎమంటారు ..పిల్ల పూక్ సైనిక్స్

  10. వైఎ*స్ఆర్ నీ వారసత్వ సిఎం పదవి కోసం లేపేసిననా ఇంట్లో కోడి కత్తి దొం*గ కి ఏమీ శిక్ష వెయ్యాలి అక్కయ్య?

  11. Laddu kalthi devudu chusu kuntadu. Church lu christinaty peragatam me jagan chusukuntada?jagan hayam lo enni church lu constructions ayyao and conversion to Christianity entha mandhu ayyaro oka article rai.jagan time lo polvaram,capital destruction,sand mafia, cheap liqor,construction labour sucide lu,conversion mafia,babai murder ,sister party change etc articles rayochhu ga.em Kula gajji addu vastundha?

  12. నీ బొంద . నువ్వు వార్తలు రాయాలి కానీ…. వాస్తవాలు పనికి మాలిన రాతలు కాదు విజయ లక్షిమి .

    1. వాస్తవాలె ఆమె వ్రాసింది. లడ్డులో వాడే నెయిలో కలిసితమైతే దేవుడు చూసుకుంటాడు మరి ప్రజలు వాడే ఆహరపదార్థాల్లో కల్తీ జరిగితే ఎవరు కాపాడాలి. ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను అందించే బాధ్యత ప్రభుత్వ పెద్దలదేని ఆమె చెప్పింది నిజమేకదా

Comments are closed.