సీమను చూసి నేర్చుకోవాల్సిందే

మొత్తం మీద మూడు రాజ‌ధానుల వ్యవహారంలో సామాజిక మీడియా మాయ మాటలు నమ్మని జ‌నాలు కనిపించారు. ఉత్తరాంధ్రకు రాజ‌ధాని ఇస్తామన్నా కూడా సదరు సామాజిక మీడియా మాయ మాటల కారణంగానో, సహజంగానే ఉత్తరాంధ్ర వాసుల్లో…

మొత్తం మీద మూడు రాజ‌ధానుల వ్యవహారంలో సామాజిక మీడియా మాయ మాటలు నమ్మని జ‌నాలు కనిపించారు. ఉత్తరాంధ్రకు రాజ‌ధాని ఇస్తామన్నా కూడా సదరు సామాజిక మీడియా మాయ మాటల కారణంగానో, సహజంగానే ఉత్తరాంధ్ర వాసుల్లో వున్న మెతక వైఖరి కారణంగానో అక్కడ పెద్దగా జ‌నం ఉద్యమించలేదు. 

అమరావతి జ‌నాలను, మీకు రాజ‌ధాని కావాలని చెప్పండి.. అంతే కానీ మాకు రాజ‌ధాని వద్దు అనే హక్కు మీకెవరిచ్చారు అని నిలదీయలేదు. అమరావతి జ‌నాల మాదిరిగా ‘అరసవిల్లి టు అమరావతి’ అనే రివర్స్ యాత్రను మొదలుపెట్టలేదు.

కానీ జ‌స్ట్ హైకోర్టు ఇస్తానంటేనే సీమ వాసులు నిలబడ్డారు. చంద్రబాబు మీద తిరగబడుతున్నారు. సామాజిక మీడియా పాచికలు పారనివ్వడం లేదు. అదే అసలు కర్నూలులో రాజ‌ధాని అని అంటే ఈ యాత్రలు కనీసం సీమ బోర్డర్ కూడా టచ్ చేయగలిగేవి కాదు. చంద్రబాబు అటు కన్నెత్తి చూడగలిగేవారు కాదు. అని అర్థం అవుతోంది.

ఇకనైనా ఉత్తరాంధ్ర జ‌నాలు బాబుగారి కి కవచకుండలాల మాదిరిగా తయారైన సామాజిక కుల మీడియా సంగతిని పసిగట్టాలి. తెలుగుదేశం పుట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్ర మీద రాజ‌కీయంగా, వ్యాపార పరంగా పెత్తనం చెలాయిస్తూ కూడా, వేరే సామాజిక వర్గాల మీద బురదజ‌ల్లే అసలు సిసలు కులం ఏదో గమనించి, తమ స్వంత ఎజెండాను జ‌నాలు ఫిక్స్ చేసుకోవాలి.

ఇక్కడ సింపుల్ లాజిక్. ఉత్తరాంధ్రకు రాజ‌ధాని కావాలా? వద్దా? ఉత్తరాంధ్రకు రాజ‌ధాని ఇస్తామంటే వేరే వైపు జ‌నాలను మళ్లించాలని చూస్తున్నది ఎవరు? విశాఖను దోచుకోవడానికే రాజ‌ధాని అన్న కలర్ వచ్చేలా చేస్తున్నది ఎవరు? ఉత్తరాంధ్ర మీద దశాబ్దాల కాలంగా పెత్తనం చెలాయిస్తూ, కూడా వేరే సామాజిక వర్గం మీద అదే బురద జ‌ల్లుతున్నది ఎవరు? ఇవన్నీ కేవలం రాజ‌ధానిని అడ్డుకోవడానికి కాక మరేంటీ?

ఈ దిశగా ఉత్తరాంధ్ర ప్రజ‌లు కూడా దృష్టి పెడితే తప్ప సీమ జ‌నాల మాదిరిగా ఉత్తరాంధ్ర జ‌నాలు కూడా సీమ జ‌నాల మాదిరిగా తమకు కావాల్సింది, రావాల్సింది సాధించుకోగలుగుతారు. లేదూ అంటే గత మూడు నాలుగు దశాబ్ధాలుగా ఏ వర్గం అయితే ఉత్తరాంధ్ర మీద సామాజిక, రాజ‌కీయ పట్టు సాధించి, అధికారం చెలాయిస్తూందో, సదరు వర్గం కిందే మరికొన్ని దశాబ్దాలు మగ్గిపోవాల్సి వస్తుంది.