బుద్దా… యాక్ష‌న్‌కు రియాక్ష‌న్!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న దూల‌తీరింది. బుద్దాను నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకున్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్య‌ధికంగా బీసీల‌కు స్థానం క‌ల్పించ‌డాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన బుద్దా వెంక‌న్న…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న దూల‌తీరింది. బుద్దాను నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకున్నారు. జ‌గ‌న్ కేబినెట్‌లో అత్య‌ధికంగా బీసీల‌కు స్థానం క‌ల్పించ‌డాన్ని అదే సామాజిక వ‌ర్గానికి చెందిన బుద్దా వెంక‌న్న ఆహ్వానించ‌క‌పోగా, విమ‌ర్శించ‌డాన్ని నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ బుద్దా మీడియాతో మాట్లాడుతూ అన్న మాట‌ల‌ను తీసుకుని ఘాటు కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డ్డారు.

ఎక్కువ మంది బీసీల‌కు మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌డాన్ని బుద్దా వెంక‌న్న త‌ప్పు ప‌ట్టారు. బీసీల‌పై సీఎం జ‌గ‌న్ క‌ప‌ట ప్రేమ చూపుతున్నార‌ని విమ‌ర్శించారు. బీసీల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఆర్థికంగా దెబ్బ‌తీసింద‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్ త‌న చెప్పు చేతుల్లో ఉన్న వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి, బీసీల‌కు ఏదో చేశామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బుద్దా వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌కంగా సెటైర్స్ విసిరారు.

నిజ‌మే, బీసీల‌ను జ‌గ‌న్ ఆర్థికంగా బాగా దెబ్బ తీశార‌ని బుద్దాను దెప్పి పొడిచారు. ఎలాగంటే, అంటూ త‌మ‌దైన రీతిలో కామెంట్స్ చేశారు. వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వ‌డంతో సంబ‌రాలు చేసుకోడానికి ఆర్థిక భారం మోపార‌ని పేర్కొన్నారు. టపాసులు పేల్చుకోవల్సి వచ్చింద‌ని, బొకేలు ఇచ్చుకోవాల్సి వచ్చింద‌ని, ఆత్మీయులకు విందు భోజనాలు పెట్టాల్సి వచ్చింద‌ని…. ఇదంతా బీసీల‌ను ఆర్థికంగా దెబ్బతీసే కుట్రగా నెటిజ‌న్లు బుద్దాను కామెంట్స్‌పై సెటైర్స్‌తో కుళ్ల‌పొడిచారు. 

ఈ సంద‌ర్భంగా బుద్దా వెంక‌న్న‌ను విజ‌య‌వాడ‌ తెలుగుదేశం టైగర్‌గా, ఆర్థిక శాస్త్ర అంశాల్లో నోబెల్ బహుమతి కోసం ఎదురు చూస్తున్న నిపుణుడిగా, బ‌హుగ్రంధ‌క‌ర్త‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం. అర్థ‌మ‌వుతోందా బుద్దా… యాక్ష‌న్‌కు రియాక్ష‌న్ ఎంత వేగంగా వ‌స్తున్న‌దో!