జోరుమీదున్న రోజా.. అసలేంటి మేటర్..?

ఏపీఐఐసీ చైర్మన్ గా దిగిపోయిన తర్వాత కొన్నిరోజులు అనారోగ్య కారణాలతో మీడియాకి దూరంగా ఉన్న రోజా ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు. అటు టీవీ షోలు ఆపలేదు, ఇటు పొలిటికల్ లైఫ్ లో కూడా…

ఏపీఐఐసీ చైర్మన్ గా దిగిపోయిన తర్వాత కొన్నిరోజులు అనారోగ్య కారణాలతో మీడియాకి దూరంగా ఉన్న రోజా ఇప్పుడు బాగా బిజీ అయిపోయారు. అటు టీవీ షోలు ఆపలేదు, ఇటు పొలిటికల్ లైఫ్ లో కూడా అంతకు మించి అనేలా జనంలోకి వచ్చారు. 

కబడ్డీ ఆడుతూ, వాలీబాల్ ఎగరేసి కొడుతూ, డప్పు వాయిస్తూ.. అబ్బో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అంతే కాదు.. మీడియాలో బాగా హైలెట్ అవుతున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ తరపున మీడియాలో బాగా హైలెట్ అయిన ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అది రోజా ఒక్కరే.

పెరిగిన విమర్శల  డోసు..

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా.. ఎన్నికల టైమ్ లో బైబై బాబు అంటూ బాగా ఫేమస్ అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం కొన్నాళ్లు కాస్త వెనక్కు తగ్గారు. 

తొలి దశలో మంత్రి పదవి రాకపోవడంతో రోజా ఫీలయ్యారని, అందుకే స్పీడ్ తగ్గించారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ రోజా జోరు పెంచారు. చంద్రబాబు, లోకేష్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎక్కడ నోరు జారినా, ఇక్కడ రోజా వాయిస్ వెంటనే బయటికొస్తోంది.

కేబినెట్ బెర్త్ ఖాయమేనా..?

ఇదంతా చూస్తుంటే రోజాకి కేబినెట్ బెర్త్ ఖాయమనే సంకేతాలు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవిపై హామీ దక్కడం వల్లే రోజాలో కొత్త ఉత్సాహం కనపడుతోందనే వార్తలు బయటికొస్తున్నాయి. 

రెండో దఫా మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చేస్తానంటూ జగన్ ఇదివరకే చెప్పారు, ఆ మేరకు ఇప్పటికే ఉన్న మంత్రులకి కూడా సంకేతాలు అందినట్టు చెబుతున్నారు.

గతంలో సామాజిక సమీకరణాల్లో రోజా మంత్రి పదవి మిస్ అయ్యారు. మరి ఈసారైనా ఈ ఫైర్ బ్రాండ్ కి కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందా..? ఆమెలో కనపడుతున్న సంతోషానికి కారణం అదేనా..? మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.