చిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కూతుళ్లను చంపుకున్న తల్లిదండ్రుల పై జరుగుతున్న మానసిక విశ్లేషకుల చికిత్సలో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని తెలుస్తోంది.
పురుషోత్తమ్ నాయుడు, పద్మజలను విచారిస్తున్న వైద్యులు వారికి తీవ్ర మానసిక సమస్యలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి రుయాలో వారిని విచారించిన వైద్య నిపుణులు వారికి దీర్ఘకాలం చికిత్స అవసరం అని, వారిని విశాఖలోని మానసిక వైద్యాలయానికి తరించాలని సూచించినట్టుగా తెలుస్తోంది.
పిచ్చాసుపత్రిలో ఉంచి వారికి చికిత్సను అందించడమే మార్గమని వైద్యులు స్పష్టం చేసినట్టుగా సమాచారం. పద్మజ మానసిక పరిస్థితి ఏ మాత్రం సరిగా లేదని, ఆమెకు అనువంశికంగా ఈ సమస్య వచ్చినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఆమె తండ్రి కూడా మానసిక సమస్యలతో 20 సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డాడని, అలా వంశపారంపర్యంగా కూడా ఆమెకు, ఆమె కూతుళ్లకు ఈ సమస్య వచ్చి ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తూ ఉన్నారు.
ఇక పురుషోత్తమ్ నాయుడు మరిన్ని సంచలన విషయాలను వెల్లడించాడట. తన కూతుళ్లు తను పూర్వజన్మలో అర్జునుడు అని ఆయనకు చెప్పారట. పాండవుల్లో అర్జునుడు స్ఫూర్తి నింపినట్టుగా వ్యవహరించాలంటూ ఆయనకు కూతుళ్లు చెప్పే వారట. అంతే కాదు.. కళియుగం అంతమైపోతోందని, కరోనా అందుకు సాక్ష్యమని, తను చదివిన పుస్తకాల్లో కూడా అదే ఉందని పెద్ద కూతురు తేల్చి చెప్పిందట!
కుక్కను చంపి బతికించినట్టుగా చెప్పుకున్న పెద్ద కూతురు ఈ హత్యలకు పురిగొల్పినట్టుగా పోలీసుల, విచారణ ద్వారా బయటపడుతూ ఉంది. అన్నింటి కన్నా దారుణం ఏమిటంటే.. కూతురును హత్య చేసిన పద్మజ తనను తాను కాళికగా భావించి మృతురాలి నాలుకను కోసి తను తినేసిందట! ఈ విషయాన్ని పురుషోత్తమ్ నాయుడు విచారణలో చెప్పినట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి.
వీళ్లు తమదైన వింత ప్రపంచంలోకి వెళ్లిపోవడమే గాక, క్షుద్ర పూజలకు తోడు.. ఏకంగా నరమాంసభక్షణకు కూడా వెనుకాడకపోవడం వీరి మానసిక స్థితి ఎంత దారుణంగా ఉందో చాటి చెబుతోంది.