స్క్రూ డ్రైవర్ తో కళ్లు పొడిచి హత్య

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత భయానకంగా ఓ అమ్మాయి హత్యకు గురైంది. ఆమె 2 కళ్లను పొడిచేశారు. గొంతు కోశారు, నీటిలో ముంచారు. వికారాబాద్ జిల్లాలో జరిగింది ఈ దారుణం. Advertisement పరిగి మండలం…

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత భయానకంగా ఓ అమ్మాయి హత్యకు గురైంది. ఆమె 2 కళ్లను పొడిచేశారు. గొంతు కోశారు, నీటిలో ముంచారు. వికారాబాద్ జిల్లాలో జరిగింది ఈ దారుణం.

పరిగి మండలం కాలాపూర్ లో ఈరోజు ఉదయం ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఊరికి సమీపంలో ఉన్న నీటికుంటలో శవమై తేలిన ఆ అమ్మాయిని 19 ఏళ్ల శిరీష గా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసిన గ్రామస్తులు, ఆ స్థితి చూసి భయపడ్డారు.

శిరీష రెండు కళ్లను స్క్రూ డ్రైవర్ లాంటి పదునైన వస్తువుతో పొడిచారు. ఆ తర్వాత మరో పదునైన వస్తువుతో గొంతు కోశారు. శిరీష ఒంటిపై ఇతర గాయాలు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఇంటర్ పూర్తిచేసిన శిరీష, ఈమధ్యే ఓ పారామెడికల్ కాలేజీలో చేరింది.

కేసు నమోదుచేసిన వెంటనే విచారణను వేగవంతం చేశారు పరిగి డీఎస్పీ కరుణసాగర్. నిన్న రాత్రి తన అక్క భర్త అనీల్ తో శిరీష గొడవ పడినట్టు గుర్తించారు. ఓ దశలో అనీల్, శిరీషపై చేయిచేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష, తను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లిపోయింది. అలా వెళ్లిన కొన్ని గంటలకే ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

శిరీష అమ్మా-నాన్నను ఇప్పటికే విచారించిన పోలీసులు, అక్క భర్త అనీల్ ను ప్రశ్నించే పనిలో పడ్డారు. మరోవైపు శిరీష మొబైల్ ఫోన్ ను కూడా విశ్లేషిస్తున్నారు. శిరీషను కేవలం ఒకరే హత్య చేసి ఉంటారని తాము అనుకోవడం లేదని, డీఎస్పీ స్పష్టత ఇచ్చారు. మరికొన్ని గంటల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కాలాపూర్ లో మాత్రం స్థానికులు ఇంత భయంకరమైన హత్యతో వణికిపోతున్నారు.