దాసరి దగ్గరకెళ్లద్దురో డింగరీ

దాసరి నారాయణరావు..పెద్దాయిన. ఇండస్ట్రీలో ఏదైనా సినిమాను కాస్త ఎత్తాలంటే ఆయన దగ్గరకు వెళ్లి, ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి, నాలుగు మంచి ముక్కులు మాట్లాడించడం అలవాటైంది టాలీవుడ్ జనాలకు. నిజానికి పచ్చిగా చెప్పుకోవాలంటే,…

దాసరి నారాయణరావు..పెద్దాయిన. ఇండస్ట్రీలో ఏదైనా సినిమాను కాస్త ఎత్తాలంటే ఆయన దగ్గరకు వెళ్లి, ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి, నాలుగు మంచి ముక్కులు మాట్లాడించడం అలవాటైంది టాలీవుడ్ జనాలకు. నిజానికి పచ్చిగా చెప్పుకోవాలంటే, దాసరి సినిమాలే చూసేవారు లేరు..ఆయన చెబితే చూసేవారు ఎవరుంటారు?

కానీ టాలీవుడ్ జనాలకు అదో భ్రమ అలా వుండిపోయింది అంతే. పైగా అలా చెప్పడానికి వీళ్ల కొత్తవాళ్లని ట్రయ్ చేయరు. రాజమౌళినో, వినాయక్ నో, మారుతి చేతనో చెప్పించవచ్చు, కదా ..కానీ ఇంకా దాసరినే పట్టకుని వేలాడతారు. 

పోనీ, అక్కడికి వెళ్లినా పనేమన్నా సక్రమంగా జరుగుతుందా? ఏదో ఒక మాట అంటారు..దాన్ని పట్టుకుని, జనం రచ్చ రచ్చ చేస్తారు. గతంలో ఓసారి ఇలాగే బన్నీకి..చరణ్ కు మధ్య ఫిటింగ్ పెట్టేలా మాట్లాడారు. ఇప్పుడు రుద్రమదేవి విషయంలోనూ అలాగే. ఇప్పుడు మెగాఫ్యామిలీ జనాలు,  రుద్రమదేవి నిర్మాత దాసరి దగ్గరకు అస్సలు ఎందుకు వెళ్లాలి అని వాళ్లలో వాళ్లు ప్రశ్నిస్తున్నారట.

అనవసరంగా ఫ్యామిలీ జనాల్లో తేడాలు వస్తున్నాయిని, అందువల్ల తమ సినిమాల విషయంలో దాసరి దగ్గరకు వెళ్లడాన్ని అవాయిడ్ చేయాలని భావిస్తున్నారట. వాళ్లు అనుకున్నా అనుకోకపోయినా, ఇక మళ్లీ మెగా స్టార్స్ సినిమా తీసిన ఏ నిర్మాత దాసరి దగ్గరకు వెళ్లి రచ్చ చేసుకునే ధైర్యం చేయకపోవచ్చు.

అయితే ఇక్కడ ఇంకో సమస్య వుంది. దాసరి దగ్గరకు వీళ్లు వెళ్లకపోయినా, ఆయన వస్తానంటే..బన్నీ సినిమా  విషయంలో అలాగే అయింది కదా? దాసరి అడిగి మరీ, సమావేశానికి రావడం, ఆ తరువాత జరిగిన వ్యవహారాలు గుర్తున్నవే.

అలా అడిగి, ఒపీనియన్ చెప్పి, రచ్చ చేస్తే, ఇంక చేసేదేముంది? అయినా వృద్ధ సింహం ఎంతయినా వృద్ధ సింహమే. ఒకటి రెండు సార్లు గాండ్రిస్తే, సింహం కదా అనుకుంటారు..రాను రాను ఆ గాండ్రిపును పట్టించుకోవడం మానేస్తారేమో?

అయినా పెద్దాయిన కూడా కాస్త ఇబ్బంది కరమైన మాటలు మాట్లాడకుండా వుంటే, పెద్దరికం పదికాలాలు నిలబడుతుంది కదా?