ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. ఏదీ శాశ్వతం కాదు. కానీ కొన్ని విజయాలు భలే కిక్కునిస్తాయి. అలాంటి విజయం గురించి ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. ఆ కోవలోకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్వగ్రామం కూడా వస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల నిమ్మగడ్డ స్వస్థలం.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టి ఆ గ్రామంపై పడింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అనే రీతిలో విభేదాలు చోటు చేసుకున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియే దానికి కేంద్రమైంది. ఈ నేపథ్యంలో మొదటి విడత పోలింగ్లో దుగ్గిరాల పంచాయతీకి ఎన్నిక జరిగింది. ఇక్కడి నుంచి వైసీపీ మద్దతుదారు బాలావర్తు కుషీబాయి తన సమీప ప్రత్యర్థిపై 1,169 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
అలాగే నిమ్మగడ్డ నివాసం ఉంటున్న వార్డులో వైసీపీ అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. ప్రభుత్వ విజయాలను అడ్డుకోవాలని శక్తివంచన లేకుండా కృషి చేసిన, చేస్తున్న నిమ్మగడ్డకు సొంత ఊళ్లో, వార్డులోనే జగన్కు విశేష ప్రజాభిమానం ఉందంటూ అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నిమ్మగడ్డ సొంత పంచాయతీలో వైసీపీ మద్దతుదారు విజయం ….అధికార పార్టీకి ఎంతో ప్రత్యేకం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడం విశేషం. కాగా పంచాయతీ తొలి విడత ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం చమత్కారం ఆకట్టుకుంటోంది.
టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడ (అచ్చెన్నాయుడు స్వస్థలం) మాత్రమేనని తలశిల వ్యంగ్యంగా అన్నారు.