స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మొదటి విడతలో భాగంగా రాయలసీమలో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆయన నిన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షించారు. అనంతపురం జిల్లా పర్యటనలో అధికారుల సమీక్షలో ఆసక్తికర ఘటన చోటు చేసుకున్నట్టు మీడియా ద్వారా తెలుస్తోంది.
ఆ ఘటనకు సంబంధించి సాక్షి పత్రికలో ఆసక్తి రేకెత్తించే కథనం వెలువడింది. ఒక అధికారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్, ఆ తర్వాత అతని పేరు కనుక్కుని సారీ చెప్పారనే సమాచారాన్ని రాసుకొచ్చారు.
ఈ సంక్షిప్త కథనం రాయడం వెనుక పరోక్షంగా ఎస్ఈసీ కులపిచ్చిని జనం దృష్టికి తీసుకెళ్లడమే ధ్యేయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పత్రికలో రాసిన ఆ కథనం ప్రకారం ఏం జరిగిందంటే…
అనంతపురంలో అధికారులతో ఎస్ఈసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ(కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడును నిమ్మగడ్డ … ‘ఈ రోజు పత్రికలు చూశావా? గవర్నరు వద్ద ఏం జరిగిందో తెలుసా?’ అని ప్రశ్నించారు. అందుకు ఆ అధికారి పత్రికలు, టీవీలు చూడలేదని సమాధానం ఇచ్చారు. దీంతో నిమ్మగడ్డకు కోపం వచ్చింది. సెన్సూర్ (అభిశంసన) చేస్తానంటూ భయపెట్టారు.
‘పత్రికలు, టీవీలు చూడకపోతే ఎన్నికల సమయంలో నువ్వేం పని చేస్తావ్’ అని చిందులు తొక్కారు. దీంతో ఆ అధికారి భయాందోళనకు గురయ్యారు. తానేమీ ఖాళీగా కూచోలేదని సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తెల్లవారుజామునే వచ్చి రిటర్నింగ్ అధికారులకు ఫోన్లు చేసే పనిలో పడ్డట్టు విశ్వేశ్వరనాయుడు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నిమ్మగడ్డ వినిపించుకోలేదు.
‘గవర్నర్ వద్దకు వెళ్లి రాజకీయ పార్టీలు ఏం చెప్పాయో తెలియకపోతే ఏం డ్యూటీ చేస్తావ్?’అని గద్దించారు. ఆ తర్వాత కాసేపటికి మీ పేరేంటి? అని సదరు అధికారి నిమ్మగడ్డ ప్రశ్నించారు. విశ్వేశ్వర‘నాయుడు’ అని చెప్పడంతో, నిమ్మగడ్డ అవాక్కయ్యారు.
దీంతో నిమ్మగడ్డ సారీ చెప్పినట్టు ఆ పత్రికలో రాశారు. ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ … ఎస్ఈసీని ప్రభుత్వ పెద్దలు బద్నాం చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదనేందుకు ఇదే ఉదాహరణ.