“నాక్కొంచెం తిక్కుంది.. కానీ.. దానికో లెక్కుంది”.. ఇది గబ్బర్సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. “చిరంజీవి, పవన్కల్యాణ్, జోగయ్య లాంటి కొంత మంది వ్యక్తుల్ని చూసి ఆ కులానికి రిజర్వేషన్లు అవసరం లేదనుకున్నారేమో…కాపుల గురించి మాట్లా డ్డానికి వెనక్కి తగ్గే వ్యక్తిని కాను” …అని రాజకీయ తెరపై జనసేనాని తాజాగా అన్న మాటలివి.
ఇంత కాలం తాను కులానికి, మతానికి అతీతమంటూ చెప్పుకొచ్చిన పవన్ …ఇక ఆ ముసుగును తనకు తానే తొలగించుకున్నారు. తాను అందరి వాడిని అనే ముసుగును తొలగించుకునేందుకు ఆయన పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కాపుల సమస్యలపై అందుకు సంబంధించిన నాయకులు వచ్చి ఆయన్ను కలిసినట్టు ఓ సీన్ క్రియేట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు సంఘాల ప్రతినిధులను పవన్ కలుస్తారంటూ రెండుమూడు రోజులుగా ఓ ప్లాన్ ప్రకారం మీడియాలో జనసేన ప్రచారం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపుల ఓటు బ్యాంకు ఉందని పవన్కల్యాణ్ చెప్పడం విశేషం. ఇది తన బలమని పవన్ పరోక్షంగా ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శుక్రవారం జనసేన కార్యాలయంలో పవన్కల్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా హరిరామజోగయ్య మాట్లాడుతూ జనసేనపై కులం ముద్ర వేస్తారనే భయంతోనే ఇప్పటి వరకూ పవన్ను కలవలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు కలిస్తే జనసేనపై కులం ముద్ర వేయరా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ స్థానిక సంస్థలు, తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన కాపుల పార్టీ అనే ముద్ర వేయడం ద్వారా అత్యధిక లబ్ధి పొందొచ్చనే ఎత్తుగడ కనిపిస్తోందంటున్నారు.
అందుకే పవన్ తాను కాపు నాయకుడినే అనే సంకేతాన్ని మరింత బలంగా తీసుకెళ్లే ఉద్దేశంతోనే …. చిరంజీవి, పవన్కల్యాణ్, జోగయ్య లాంటి కొంత మంది వ్యక్తుల్ని చూసి ఆ కులానికి రిజర్వేషన్లు అవసరం లేదనుకున్నారేమోనని చమత్కరించారంటున్నారు.
రాజకీయాల్లో కులం కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో ఎలాగైనా తన అన్న చిరంజీవిని వీలైతే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షం గానైనా జనసేనకు మద్దతుగా తీసుకురావాలని పవన్ భావిస్తున్నట్టు …. తాజాగా ఆయన మాటలే తెలియజేస్తున్నాయి.
రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం కాపుల ఓటు బ్యాంకు ఉందని చెప్పడం, కాపులు శాసించే స్థితికి ఎదగాలని పవన్ పిలుపునివ్వడం వెనుక వ్యూహం ఉందంటున్నారు. కాపులంతా తన నాయకత్వాన్ని బలపరచాలనే పిలుపు అందులో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపులంతా ఐక్యం అయ్యే క్రమంలో ఇది తొలి అడుగుగా చెబుతున్నారు.
పవన్, చిరంజీవితో పాటు కాపు నేతలంతా ఏకమై …. మన ఓట్లు, మన నాయకత్వం అనే ఫీలింగ్ బలపడితే మాత్రం ప్రత్యర్థు లకు చుక్కలే అని చెప్పొచ్చు. ప్రధానంగా కాపు ఓటు బ్యాంకునే నమ్ముకున్న పార్టీలకు మాత్రం బీజేపీ -జనసేన కూటమి తీరని నష్టాన్ని మిగుల్చుతుందని హెచ్చరించక తప్పదు.