అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!

టాలీవుడ్ నటులు, నిర్మాతలను నియంత్రించడానికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు.

అల్లు అర్జున్ వివాదాన్ని సినిమా పరిశ్రమ పెద్దలు పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో వారంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా పట్టు వీడుతున్న సూచనలు కనిపించాయి.

ఈ వివాదంలో మొదటి నుంచి గులాబీ పార్టీ, బీజేపీ అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తున్నాయి. ఈమధ్య బీఆర్ఎస్ కొద్దిగా తగ్గినా బీజేపీ మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బద్ధ శత్రువు కాబట్టి ఈ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఆయన ప్రభుత్వం టాలీవుడ్ కి శత్రువు అన్న ధోరణిలో నాయకులు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితర నాయకులు మాత్రమే కాకుండా ఢిల్లీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమను వేధిస్తున్నాడని, అది ఏపీకి తరలిపోవాలన్న ఉద్దేశంతోనే అలా చేస్తున్నాడని అంటున్నారు. తాజాగా బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయ ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను టార్గెట్ చేశాడని అన్నాడు.

టాలీవుడ్ నటులు, నిర్మాతలను నియంత్రించడానికి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపించాడు. దీంతో వారు భయపడుతున్నారని అన్నాడు. ఈమధ్య గులాబీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ మాటన్నాడు.

రేవంత్ రెడ్డిని భయపెట్టడానికి అన్నాడా తెలియదు. ఇంతకూ దయాకర్ రావు ఏమన్నాడంటే ….తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైకి తరలిపోవాలని టాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారట! తరతరాలు హైదరాబాదులో స్థిరపడిన పరిశ్రమ మరో రాష్ట్రానికి తరలివెళ్లడం అంత సులభం కాదు.

అల్లు అర్జున్ ఉదంతం నేపథ్యంలోనే ఓ విలేకరి నిర్మాత నాగవంశీని చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళుతుందా? అని అడిగాడు. ఆంధ్రకు వెళ్లి ఏం చేస్తామని ఆయన ప్రశ్నించాడు. ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు నాయుడు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి రావాలని కోరాడు.

ఎందుకంటే ….టాలీవుడ్ లో ఉన్న ఎనభై శాతం మంది ఆంధ్రవాళ్లే. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా చిత్ర పరిశ్రమ ఎక్కడికీ తరలివెళ్లదని చెప్పాడు. టాలీవుడ్ వల్ల ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం ఉంది. అలాంటి పరిశ్రమను ప్రభత్వం ఎందుకు వదులుకుంటుంది ?

మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాదుకు తీసుకురావడానికి అప్పటి ప్రభుత్వాలు (ప్రధానంగా కాంగ్రెస్) చాలా కష్టపడ్డాయి. దశవారీగా చెన్నైలో ఉన్న సినీ ప్రముఖులంతా హైదరాబాదుకు వచ్చారు. అన్ని సౌకర్యాలు సమకూర్చుకున్నారు. పరిశ్రమ బ్రహ్మాండంగా ఎదిగింది. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్నారు.

దేశంలోనే టాలీవుడ్ కు గుర్తింపు ఏర్పడింది. ఇదంతా వదులుకొని పరిశ్రమ తరలి వెళుతుందని అనుకోవడం ఊహాగానం మాత్రమే. సినిమా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టి బెనిఫిట్ షోలకు, టిక్కెట్ల పెంపునకు అనుమతించవచ్చని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ పై కేసు కూడా ఇంకా ముందుకు పోకపోవచ్చని, బాధిత కుటుంబానికి కూడా తగినంత ఆర్ధిక సహాయం అందింది కాబట్టి, రేవతి భర్తకు కూడా చిత్ర పరిశ్రమలోనే పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని దిల్ రాజు హామీ ఇచ్చాడు కాబట్టి ఈ వివాదం ఇంతటితో సమసిపోయే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయడం మంచిది.

5 Replies to “అల్లు అర్జున్ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్న బీజేపీ!”

  1. Before Bahubali, total revenue for tollywood was around 1000 crores/year. This might have increased 10 times now.

    How come tollywood has lakhs of crores income?

Comments are closed.