కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఏమ‌వుతుందో తెలియ‌దా ష‌ర్మిలా!

త‌న తండ్రి వైఎస్సార్ విగ్ర‌హాల‌ను టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేయ‌డంపై ఆల‌స్యంగా అయినా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల స్పందించారు. ఎన్నిక‌ల్లో కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించేలా, ముంద‌స్తు అవ‌గాహ‌న‌తో ష‌ర్మిల…

త‌న తండ్రి వైఎస్సార్ విగ్ర‌హాల‌ను టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేయ‌డంపై ఆల‌స్యంగా అయినా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల స్పందించారు. ఎన్నిక‌ల్లో కూట‌మికి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లిగించేలా, ముంద‌స్తు అవ‌గాహ‌న‌తో ష‌ర్మిల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌చారం నిర్వ‌హించార‌నే ఆరోప‌ణ లేక‌పోలేదు. ఎన్నిక‌ల అనంత‌రం ష‌ర్మిల‌పై  సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర‌మైన ఆర్థిక లావాదేవీల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇక కూట‌మితో ఆమెకు ఆర్థిక లావాదేవీలున్నాయ‌ని ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లున్నాయి. ష‌ర్మిల కోరుకున్న‌ట్టే ఆమె అన్న ప్ర‌భుత్వం గ‌ద్దె దిగింది. ఆమె ఆశించిన‌ట్టుగా కూట‌మి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇంకా అధికారిక ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌నే టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌స్థాయిలో దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. వైఎస్సార్ విగ్ర‌హాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ కూల్చుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల స్పందించ‌క‌పోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. వైఎస్సార్ విగ్ర‌హాల‌ను కూల్చ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆమె చేసిన పోస్టు ఏంటంటే…

“రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు.  వైఎస్సార్‌ను అవమానించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది”

వైఎస్సార్ పేరు వింటే టీడీపీకి కోపం. అందుకే ఆయ‌న విగ్ర‌హాల‌ను ప‌డ‌గొడుతున్నారు. కార‌ణాలేవైనా కూట‌మి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసి, ఇప్పుడు ల‌బోదిబోమంటే లాభం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వ‌స్తుందో ష‌ర్మిల ఊహ‌కు అంద‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ పాపంలో త‌న పాత్ర కూడా వుంద‌ని ష‌ర్మిల‌కు అర్థ‌మైతే చాలు అని వైసీపీ నేత‌లు అంటున్నారు.