కేంద్ర కేబినెట్ విస్తరణలో జనసేనకు బీజేపీ మొండి చెయ్యి చూపింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురికి మోదీ కేబినెట్లో చోటు దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ ఎంపీకి అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో జనసేన తరపున ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. ఇద్దరూ పవన్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలే కావడం విశేషం.
జనసేన ఎంపీ బాలశౌరికి మోదీ కేబినెట్లో అవకాశం ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ, కేంద్ర మంత్రుల జాబితాలో జనసేనకు చోటు లేదు. ఆదిలోనే జనసేనను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలో తానే కీలక పాత్ర పోషించానని పవన్కల్యాణ్ పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే పవన్కు విశేష ప్రాధాన్యం ఇస్తారనే చర్చ లేకపోలేదు.
ఈ నేపథ్యంలో జనసేనకు అవకాశం ఇవ్వకపోవడం ఆ పార్టీ శ్రేణులకు కొంచెం నిరాశ కలిగిస్తోంది. మరో రకంగా జనసేనకు అవకాశం కల్పిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి జనసేనను మాత్రం కేంద్ర కేబినెట్లోకి తీసుకోలేదు. ఒక కమ్మ, క్షత్రియ, బీసీ సామాజిక వర్గాలకు ఏపీ నుంచి అవకాశం ఇచ్చినట్టైంది. కాపులను ప్రస్తుతానికి పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే పవన్తో బీజేపీ అగ్రనేతలు ఏం చర్చించారనేది తెలియడం లేదు. కేంద్ర కేబినెట్లో చోటు ఇవ్వని విషయాన్ని పవన్కు చెప్పే చేశారనే ప్రచారం జరుగుతోంది.