సందీప్ కిషన్ హోటల్ పై దాడులు

గడిచిన కొన్ని రోజులుగా జంట నగరాల్లోని హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బాగా పాపులరైన హోటల్స్ లో కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించిన దాఖలాలు చూశాం. ఇప్పుడీ…

గడిచిన కొన్ని రోజులుగా జంట నగరాల్లోని హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బాగా పాపులరైన హోటల్స్ లో కూడా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించిన దాఖలాలు చూశాం. ఇప్పుడీ లిస్ట్ లోకి ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్ కూడా చేరింది. హీరో సందీప్ కిషన్ కు చెందిన హోటల్ ఇది.

‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ చెయిన్ కు సంబందించి సికింద్రాబాద్ బ్రాంచీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. రెస్టారెంట్ లో పలు నిబంధనల్ని ఉల్లంఘించినట్టు గుర్తించారు.

2022లోపు వాడాల్సిన చిట్టిముత్యాలు రైస్ ను ఇంకా వాడుతున్నట్టు గుర్తించారు. కొబ్బరి తురుమును సింథటిక్ ఫుడ్ కలర్స్ తో కలిపి వాడుతున్నట్టు గుర్తించారు. ఈ రెండు పదార్థాల్ని సీజ్ చేశారు.

పచ్చి ఆహార పదార్థాలు, సగం ఉడికించిన ఆహార పదార్థాల్ని నిబంధనల ప్రకారం స్టీల్ కంటైనర్స్ లో నిల్వ ఉంచుతున్నప్పటికీ, వాటిపై సరైన లేబుల్స్, ఎక్స్ పైరీ డేట్ వేయలేదు. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్స్ అందుబాటులో లేవు. కిచెన్ డ్రెయిన్ లో మురుగు నీరు నిలిచి ఉంది.

కీటకాలు రాకుండా నివారణ చర్యలు బాగానే తీసుకుంటున్నట్టు, ఆహార పదార్థాలు వడ్డించే సిబ్బంది శుభ్రంగా ఉంటూనే, యూనిఫామ్ ధరించినట్టు అధికారులు వెల్లడించారు.