ఇస్మార్ట్- నైజాం బయ్యర్ ఎవరో?

ఛాంబర్, కౌన్సిల్ పెద్దలు అంతా పూరి- చార్మి వైపు వున్నారు. హీరో రామ్ బంధువు రవికిషోర్ కూడా అటే వున్నారు.బాధితులు అంతా ఒక వైపు వున్నారు.

డబుల్ ఇస్మార్ట్ మీద పడిన లైగర్ నష్టాల వ్యవహారం అడుగు ముందుకు పడుతుంటే, అడుగు వెనక్కు పడుతోంది. ఇదిగో అయిపోయింది అనుకునే లోగా ఏదో చిన్న మెలిక అడ్డం పడుతోంది. చాలా రీజ‌నబుల్ గా నైజాం ఎగ్ఙిబిటర్లు తమ నష్టాలను జ‌స్ట్ 40 శాతం కవర్ చేస్తే చాలు అని ఒప్పుకున్నా కూడా ఇంకా ఒప్పందం కుదరలేదు. నైజాం బయ్యర్ ఎవరో తెేలలేదు. ఇక్కడ ఇండస్ట్రీ జ‌నం రకరకాలుగా చీలిపోయారు. ఛాంబర్, కౌన్సిల్ పెద్దలు అంతా పూరి- చార్మి వైపు వున్నారు. హీరో రామ్ బంధువు రవికిషోర్ కూడా అటే వున్నారు.

బాధితులు అంతా ఒక వైపు వున్నారు. ఏం జ‌రుగుతోందో తమకు అర్థం కావడం లేదని చార్మి నుంచి డబ్బులు రావాల్సిన ఇద్దరు బయ్యర్లు అన్నారు. తమను ఇప్పటి వరకు చార్మి సంప్రదించలేదని వారు అన్నారు. అసలు గతంలో ఒప్పుకున్న దాన్నే ఇప్పుడు ఎందుకు కాదంటున్నారో అర్థం కావడం లేదని వారన్నారు. అన్నీ ఒప్పుకునే అప్పట్లో ఇన్వాయిస్ లు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట మార్చారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలని చార్మి మనసు మార్చేసారని బాధ వ్యక్తం చేసారు.

ఇదిలా వుంటే నైజాం ఎవరు పంపిణీ చేస్తారు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. నైజాం తలకాయనొప్పులు లేకుండా వుండేందుకు ఏసియన్ సురేష్ సంస్థకు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ నిజానికి అటు చార్మీ తో కానీ, ఇటు ప్రైమ్ షో తో కానీ సంబంధాలున్నది మైత్రీ సంస్థకు. కానీ తలకాయ నొప్పులు వున్నాయని మైత్రీ సంస్థ దూరంగా వుండిపోయింది.

నైజాం వరకు ఫరవాలేదు. ఏసియన్ సంస్థకు ఇస్తే థియేటర్లు వస్తాయి. కానీ బేరాలు తెగకుండా వుంటే బుకింగ్ లు ఓపెన్ చేయడం కుదరదు. ఇంక జ‌స్ట్ మూడు రోజులు మాత్రమే సమయం వుంది. అటు సీడెడ్ లో, ఈస్ట్ గోదావరిలో లోకల్ ఎగ్జిబిటర్ సంస్ధలు పట్టుదలగా వున్నాయి. సమస్య తేలే వరకు పోస్టర్ పడకూడదు అని పట్టుగా కూర్చున్నాయి.

నిజానికి సమస్య శనివారం నాడు పరిష్కారం అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ పేమెంట్ సినిమా విడుదల తరువాత అనడంతో మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు అంతా ఛాంబర్ లో ఇదే పని మీద వున్నారు పెద్దలంతా. రాత్రికి అయినా ఓ కొలిక్కి వస్తే మంగళ వారం నుంచి థియేటర్లు బుకింగ్ లు ప్రారంభం అయ్యే చాన్స్ వుంది.

5 Replies to “ఇస్మార్ట్- నైజాం బయ్యర్ ఎవరో?”

Comments are closed.