డల్లాస్ లో తెలుగు మహిళల ఆటా పాటా

డల్లాస్ లో అక్టోబర్ 18న తెలుగు మహిళల ఆనంద విలాసాలు ఆడంబరంగా జరిగాయి. త్రివర్ణ మీడియా సంస్థ 'లేడీస్ నైట్' పేరుతో నిర్వహించిన ఈ సంబరాలు మహిళలను ఆనంద డోలికలలో ముంచెత్తాయి. న్యూజెర్సీకి చెందిన…

డల్లాస్ లో అక్టోబర్ 18న తెలుగు మహిళల ఆనంద విలాసాలు ఆడంబరంగా జరిగాయి. త్రివర్ణ మీడియా సంస్థ 'లేడీస్ నైట్' పేరుతో నిర్వహించిన ఈ సంబరాలు మహిళలను ఆనంద డోలికలలో ముంచెత్తాయి. న్యూజెర్సీకి చెందిన లక్ష్మి దేవినేని మరియు డల్లాస్ నగరానికి చెందిన 16 మంది మహిళామణుల సహాయ సహకారాలతో త్రివర్ణ మీడియా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. భారతదేశం నుండి  కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రఖ్యాత గాయని  సునీత, ప్రముఖ యాంకర్ ఉదయభాను తమ ఆట పాటలతో మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 

డల్లాస్ లో మొట్టమొదటి సారిగా జరిగిన ఇటువంటి కార్యక్రమంలో ఉదయభాను నిర్వహించిన సరదా ఆటలు ఆడడానికి, సునీతతో గొంతు కలిపి పాటలు పాడడానికి, ఆమె పాటలకు నృత్యం చేయడానికి మహిళలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. త్రివర్ణ మీడియా అధినేత, తానా ప్రాంతీయ ప్రతినిధి డా. రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ మహిళ ఒక తల్లిగా, భార్యగా, కూతురిగా మన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తూనే ఆధునిక కాలంలో భర్తకి సహకారంగా ఉద్యోగ బాధ్యతలు కూడా స్వీకరిస్తోంది. అటువంటి మహిళలను గౌరవిస్తూ వారికి ఆటవిడుపు కోసం ఒక సాయంత్రం సమయాన్ని కేటాయించి దైనందిన కార్యక్రమాలకు దూరంగా మహిళలందరూ ఒక చోట చేరి సంతోషంగా గడపడానికి వీలు కల్పించాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని చెప్పారు

ఈ కార్యక్రమానికి ఊహించిన దానికంటే మిన్నగా డల్లాస్ నుండే కాక చుట్టుపక్కల నగరాల నుండి కూడా వెయ్యి మందికి పైగా మహిళలు హాజరవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. మున్ముందు కూడా ఇటువంటి చక్కని కార్యక్రమాలను తెలుగు వారికి అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఐ స్మైల్ డెంటల్ కు చెందిన డా. సుజాత తెల్ల, ఒమేగా ట్రావెల్స్ కు చెందిన  తృప్తి దీక్షిత్ ఇంకా ఇతర స్పాన్సర్స్ ఈ కార్యక్రమానికి ఆర్దిక సహాయం అందించగా సరిగమ రెస్టారంట్ వారు చక్కని విందు భోజనం సమకూర్చారు.