ఎమ్బీయస్‌ : మాంసభక్షణపై ఆంక్షలు

గుజరాత్‌లో శాకాహారులు రాజకీయంగా బలంగా వున్నారు. గోవధ నిషేధించడంతో వారు ఆగటం లేదు. ప్రతి బక్రీద్‌కు గోవులను చాటుగా వధిస్తున్నారన్న మిషపై గొడవలు చేస్తున్నారు. ఇది మమ్మల్ని సతాయించడమే తప్ప మరేమీ కాదని ముస్లిములు…

గుజరాత్‌లో శాకాహారులు రాజకీయంగా బలంగా వున్నారు. గోవధ నిషేధించడంతో వారు ఆగటం లేదు. ప్రతి బక్రీద్‌కు గోవులను చాటుగా వధిస్తున్నారన్న మిషపై గొడవలు చేస్తున్నారు. ఇది మమ్మల్ని సతాయించడమే తప్ప మరేమీ కాదని ముస్లిములు వాపోతున్నారు. గత ఏడాది నవరాత్రి సమయంలో ఎవరో కావాలని మక్కా ఫోటోలపై దుర్గ ఫోటోలు సూపర్‌ యింపోజ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. దాతీపై గుజరాత్‌లో అహ్మదాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో అల్లర్లు జరిగి కర్ఫ్యూ కూడా విధించవలసి వచ్చింది. ఈసారి దసరా, బక్రీద్‌ దగ్గరదగ్గర్లో వచ్చాయి కాబట్టి అలాటివి జరగకూడదనే ఆలోచనతో కొంతమంది పౌరులు హిందు, ముస్లిము ముఖ్యులతో శాంతి చర్చలు జరిపారు. ఏం చేసినా లాభం లేకపోయింది. బక్రీద్‌ సందర్భంగా గొఱ్ఱెలు, గేదెలు తీసుకున్న ట్రక్కులను ఆపి మీరు ఆవులను చాటుగా తీసుకెళుతున్నారు తనిఖీలు చేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ సభ్యులు యిబ్బంది పెట్టసాగారు. చెక్‌ చేయడానికి మీరెవరంటూ ముస్లిములు వాళ్లతో తగాదా పడ్డారు. దాహోద్‌, పంచమహల్‌ జిల్లాల్లో యిది మరీ తీవ్రంగా సాగింది. బరోడా వంటి నగరాలలో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి. 

''గోవధ గుజరాత్‌లో చట్టవిరుద్ధం కాబట్టి ఎవరూ అలాటి నేరానికి పాల్పడి పండగపూట జైలుపాలవడానికి చూడడు. మోదీ ముఖ్యమంత్రిగా వుండగా గోధ్రా అల్లర్ల తర్వాత కూడా యిలాటి గొడవలు రాలేదు. ఇప్పుడు పెచ్చు మీరాయి.'' అంటున్నారు ముస్లిములు. 'మోదీ హయాంలో విఎచ్‌పి, బజరంగ్‌దళ్‌లను అదుపులో వుంచాడు. ఇప్పుడు వాళ్లు రెచ్చిపోతున్నారు.' అంటున్నారు పరిశీలకులు. గుజరాత్‌ వాతావరణాన్ని బిజెపికి పట్టున్న తక్కిన ప్రాంతాలకు కూడా వ్యాపింపచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీ శివార్లలోని బవానా ప్రాంతంలో వున్న లక్షన్నర జనాభాలో 70% మంది ముస్లిములు. అక్కడ ఆవులను తెచ్చి దాచారంటూ 200 మంది యువకులు అక్టోబరు 2 గాంధీ జయంతిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ను వెంటపట్టుకుని చెకింగ్‌కు వచ్చారు. అక్కడ ఏ ఆవూ కనబడలేదు. మహేశ్‌ అనే అతను ఆవుతో కనబడితే అతన్ని చావగొట్టారు. నేను గొల్లవాణ్ని బాబోయ్‌, ఆవు నాదే అని గోలపెట్టాడతను. తమ ఆరోపణ నిజం చేయాలని ఆ యువకులు మర్నాటి రాత్రి రెండు ఆవులను కాలనీలో వదిలిపెట్టి రమ్మనమని ఒకణ్ని పంపించారు. ఇలాటిదేదో జరుగుతుందని ఊహించిన కాలనీవాసుల కమిటీ కాపు కాసి వాణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ విషయం తెలియక 'బవానాలో జరగబోయే సభకు రండి' అంటూ హిందూ క్రాంతికారీ సేన పేర మీద యిరుగుపొరుగు కాలనీలలో పోస్టర్లు వెలిశాయి. బిజెపి ఎమ్మెల్యే పవన్‌ శర్మ మేనల్లుడు ఆ సేన నిర్వాహకుల్లో ఒకడు.

హిందువులకు గోవు పవిత్రమైనది కాబట్టి గోవధ నిషేధించాలని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఆందోళన జరుగుతూనే వుంది. వట్టిపోయిన ఆవులను, ముసలివై పోయిన ఎద్దులను జీవితాంతం పోషించడం కష్టం కాబట్టి వాటిని కోసుకుని తినడానికి అనుమతించాలని, వేదకాలపు ఆర్యుల్లో కూడా గోమాంసభక్షణ వుందన్న విషయం గ్రహించాలని కొందరు వాదిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడం రాజ్యాంగరీత్యా అనవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దాంతో 24 రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఆ పని తలపెట్టలేదు. ఈ నిషేధం కూడా అన్నిచోట్లా ఒకేలా లేదు. బెంగాల్‌లో 14 ఏళ్ల లోపు ఆవులను వధించకూడదు, తమిళనాడులో అది పదేళ్లు, అసాంలో అది నాలుగు! గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపిలలో ఏ వయసు ఆవునూ చంపడానికి వీల్లేదు. 

స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు లెక్కలోకి తీసుకుని చట్టాలు రూపొందిస్తున్నారు. మాంసభక్షణ కూడా భారతదేశమంతా ఒకేలా లేదు. మొత్తం మీద చూస్తే 31% మంది శాకాహారులు, 60% మంది మాంసాహారులు, 9% మంది గుడ్లు తినే శాకాహారులు. 2006 సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు మాంసాహారం (గుడ్లు, మాంసం, చేపలు)పై తలసరి ఖర్చు రూ.125, కేరళలో అయితే 215, గుజరాత్‌లో 24, పంజాబ్‌లో 13! ఆవులనే కాదు, గేదెలను కూడా చంపకుండా చట్టాలు జారీ చేయాలని ఆరెస్సెస్‌ ఉద్యమిస్తోంది. కానీ ఆవులు, గేదెలు ఒకే జాతికి చెందవని, కాబట్టే ఒకదానితో మరొకటి సంగమించవని సిసిఎంబి మాజీ డైరక్టర్‌ భార్గవ అంటారు. అసలు దేవుళ్ల ముందు గేదెలను బలి యిచ్చేది హిందువులే. హిందూరాజ్యమైన నేపాల్‌లోని కామాఖ్య దేవాలయంలో, కలకత్తాలోని కాళీ ఆలయంలో, మన తెలుగు ప్రాంతాల్లో కూడా దున్నపోతులను బలి యివ్వడం జరుగుతూనే వుంటుంది.  ఈ చర్చ సాగుతూండగానే రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం ఒంటెను రక్షితప్రాణిగా డిక్లేర్‌ చేసింది. దాంతో ముస్లిములకు బక్రీద్‌ నాడు ఒంటెను బలిచ్చే అవకాశం లేకుండా పోయింది. 

Click Here For Greatandhra E-paper

విజయథమి రోజున దూరదర్శన్‌లో ప్రసంగిస్తూ ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ''అన్ని రకాల మాంసాల ఎగుమతి మనం నిషేధించాలి. గోమాంసం ఎగుమతి, గోవులను చాటుగా తరలించడం వెంటనే ఆపించాలి.'' అన్నారు. దానికి ఒక పదిహేను రోజుల ముందు అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రి మేనకా గాంధీ మాంసానికి, టెర్రరిజానికి ముడిపెట్టబోయారు. ''జంతువులను చంపి, వాటి మాంసం ఎగుమతి చేసి సంపాదించిన డబ్బు టెర్రరిజానికి చేరి, అంతిమంగా మనుష్యులను చంపడానికి వుపయోగపడుతోంది'' అన్నారు. అటుతిప్పి, యిటుతిప్పి ముస్లిములకు ముడిపెడదామని చూస్తే మాత్రం పొసగదు. ఎందుకంటే భారీస్థాయి మాంసం ఎగుమతిదారులందరూ ముస్లిమేతరులే. 2012 అసెంబ్లీ ఎన్నికలలో మోదీ కాంగ్రెస్‌ సాధించినది పింక్‌ రివల్యూషన్‌ పేర మాంసం ఎగుమతులే అంటూ మతపరమైన కోణం యివ్వడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఆయన ప్రధాని చైనాతో వ్యాపారలోటు పూడ్చుకోవాలంటే మాంసం ఎగుమతులను అనుమతించడమే కాదు, పెంచవలసిన అవసరం వుంది. 2013-14లో మనం 32 లక్షల కోట్ల రూ.ల మాంసం ఎగుమతులు చేశాం. భారతదేశానికి జంతుసంపద చాలా వుంది. మనం తినకుండా, అమ్మకుండా ఏం చేయాలని వీళ్ల ఉద్దేశమో తెలియదు. 'మనం జంతువులను తినకపోతే అవే మనల్ని (ఆర్థికంగా) తినేస్తాయి' అని ఒకాయన ఛలోక్తి విసిరాడు. పార్టీలోని జైన్‌ లాబీలను తృప్తి పరచడానికి మాంసాహారంపై అప్పుడప్పుడు యిలాటి హంగామా చేసినా, మాంసభక్షణ ఎక్కువగా వున్న బెంగాల్‌, కేరళ, ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో, బిసిలు, దళితులు వగైరా వర్గాల్లో విస్తరించడానికి చూస్తున్న తరుణంలో బిజెపి దీన్ని పెద్దగా పట్టించుకోదనే అనుకోవచ్చు. 

 ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]