టార్గెట్ ఫిక్స్ చేసిన మహేష్.. ఈసారి నమ్మాల్సిందే!

మహేష్ టార్గెట్ ఫిక్స్ చేశాడంటూ లీకులు బయటకొస్తే చాలామందికి అదో పెద్ద జోక్. ఎందుకంటే, సినిమాల విషయంలో మహేష్ చాలా స్లో. చెప్పిన టైమ్ కు ఏదీ పూర్తవ్వదు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటాడు,…

మహేష్ టార్గెట్ ఫిక్స్ చేశాడంటూ లీకులు బయటకొస్తే చాలామందికి అదో పెద్ద జోక్. ఎందుకంటే, సినిమాల విషయంలో మహేష్ చాలా స్లో. చెప్పిన టైమ్ కు ఏదీ పూర్తవ్వదు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటాడు, ఆ వెంటనే గ్యాప్ తీసుకుంటాడు. 

సినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుందంటాడు, ఆ వెంటనే ఫ్యామిలీతో విదేశీయానం పెట్టుకుంటాడు. షెడ్యూల్ కు రెడీ అంటాడు, కట్ చేస్తే యాడ్ షూటింగ్ లో కనిపిస్తాడు. మహేష్ తో వ్యవహారం ఇలా ఉంటుంది.

ఎప్పట్లానే ఈసారి కూడా మహేష్ టార్గెట్ ఫిక్స్ చేశాడు. అయితే మహేష్ టార్గెట్ ను కాస్త నమ్మొచ్చు. ఎందుకంటే, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంతకీ మహేష్ టార్గెట్ చేసిన అంశం ఏంటంటే.. ప్రస్తుతం చేస్తున్న సర్కారువారి పాటను రాబోయే 45 రోజుల్లో పూర్తి చేస్తాడట.

ఈసారి ఈ డెడ్ లైన్ ను నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కరోనా/లాక్ డౌన్ కారణంగా చాలా పనిదినాలు పోయాయి. మరోవైపు త్రివిక్రమ్ చాన్నాళ్లుగా వెయిటింగ్ లో ఉన్నాడు. ఇంకోవైపు సర్కారువారిపాట సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేస్తే కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించే వెసులుబాటు లేదు.

పైగా ఈ కరోనా టైమ్ లో ఫ్యామిలితో కలిసి విదేశాల్లో పర్యటించి రిస్క్ చేయలేడు మహేష్. అందుకే ప్రస్తుతం నడుస్తున్న గోవా షెడ్యూల్ కే కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లాడు. సో.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈసారి మహేష్ తను చెప్పిన ''45 రోజులు'' టార్గెట్ ను అందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.