‘మా’ మసకబారుతోంది.. రచ్చ రిపీట్ చేసిన నాగబాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అసలైన లొల్లి మొదలైంది నాగబాబుతోనే. ఆయన ఎప్పుడైతే మసకబారింది అనే డైలాగ్ వాడారో, అప్పట్నుంచి రచ్చ మొదలైంది. ఆ వెంటనే నరేష్ ప్రెస్ మీట్ పెట్టడం.. ఆ తర్వాత…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అసలైన లొల్లి మొదలైంది నాగబాబుతోనే. ఆయన ఎప్పుడైతే మసకబారింది అనే డైలాగ్ వాడారో, అప్పట్నుంచి రచ్చ మొదలైంది. ఆ వెంటనే నరేష్ ప్రెస్ మీట్ పెట్టడం.. ఆ తర్వాత చకచకా పరిస్థితులు మారిపోయాయి.

అలా ఒక్క డైలాగ్ తో “మా”లో కలకలం రేపిన నాగబాబు, ఇప్పుడు ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ కు చేరిన తరుణంలో మరోసారి ఆ డైలాగ్ ను రిపీట్ చేశారు. సభ్యులకు డబ్బు ఆశ చూపిస్తున్నారని, ముందుగా 10వేలు ఇస్తాం, తర్వాత మిగతా డబ్బు ఇస్తామంటూ మరో ప్యానెల్ జనాలు ఆశ పెడుతున్నారంటూ ఆయన ఆరోపించారు.

“అసోసియేషన్ మెంబర్లకు డబ్బు ఆశ చూపిస్తున్నారని విన్నాను. మా అసోసియేషన్ మసకబారింది అని గతంలో అన్నాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. మా అసోసియేషన్ మసకబారబోతోంది. సభ్యుల ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతోంది. సభ్యులు ప్రలోభాలకు లొంగవద్దు.”

ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతిస్తున్న నాగబాబు.. ఆయన స్థానికతను వెనకేసుకొచ్చారు. పని చేసే వాడు కావాలా, కేవలం తెలుగువాడైతే సరిపోద్దా అని ప్రశ్నించారు. అసోసియేషన్ కు ప్రకాష్ రాజ్ అధ్యక్షుడైతే, భవిష్యత్తులో అవసరమైతే ప్రధాని మోదీతో కూడా అతడు మాట్లాడగలడని, విష్ణు ప్యానెల్ లో అలాంటి వ్యక్తులు ఎవరున్నారని ప్రశ్నించారు నాగబాబు.