టీడీపీ కూటమికి తలంటిన ఎర్రన్న!

బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామంటే ఎవరి చెవిలో పువ్వులు పెడదామని అంటూ కామ్రేడ్స్ టీడీపీ కూటమి నేతలకు తలంటారు. బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టిందని,…

బీజేపీతో పొత్తు పెట్టుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామంటే ఎవరి చెవిలో పువ్వులు పెడదామని అంటూ కామ్రేడ్స్ టీడీపీ కూటమి నేతలకు తలంటారు. బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెట్టిందని, మూడేళ్ళుగా అదే లక్ష్యంతో పనిచేస్తోందని విశాఖ జిల్లా సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం జగ్గు నాయుడు ఆరోపించారు.

అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుని మాయమాటలతో విశాఖ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారా అని టీడీపీ నేతల మీద మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతున్నా చోద్యం చూస్తున్న టీడీపీ జనసేనలను ఓడించాలని ఆయన విశాఖ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

బీజేపీతో పొత్తు అంటే స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా అమ్మేసేందుకు సహకరించడమే అని ఆయన కొత్త అర్ధం చెప్పారు. విశాఖ ప్రజలు విజ్ఞులని వారు ఈ తరహా మభ్యపెట్టే మాటలకు మోసపోరని ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్ తెస్తాం, మెట్రో రైల్ ప్రాజెక్ట్ తెస్తామని టీడీపీ కూటమి నేతలు కబుర్లు చెబితే ఎవరూ నమ్మరని ఆయన అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగలో ఉండాలంటే బీజేపీని దానితో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేనలను ఓడించాలని అంటున్నారు. విశాఖలో ఈ పార్టీలకు ప్రజలు ఓటేయకుండా చూడాలని అన్నారు. బీజేపీతో జత కట్టి రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ జనసేన దెబ్బ తీస్తున్నాయని అంటున్నారు.

ఏపీకి రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదా వంటి వాటి గురించి ఏమీ అడగకుండా కేవలం రాజకీయాల కోసమే పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఓట్లు చాలా కీలకం. ఈ తరుణంలో ఎన్డీయే పార్టీలను ఓడించాలని కామ్రేడ్స్ పిలుపు ఇవ్వడం కూటమికి దెబ్బగా మారుతుందని అంటున్నారు.