ఆ ముగ్గురు మహానటుల్ని కలిపితే రణబీర్

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను ఆకాశానికెత్తేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రపంచంలో అత్యుత్తమమైన నటులుగా పేరు తెచ్చుకున్న రోబర్ట్ డెనిరో, అల్ ప్యాచినో, కమల్ హాసన్ ను కలిపితే రణబీర్ కపూర్…

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ను ఆకాశానికెత్తేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రపంచంలో అత్యుత్తమమైన నటులుగా పేరు తెచ్చుకున్న రోబర్ట్ డెనిరో, అల్ ప్యాచినో, కమల్ హాసన్ ను కలిపితే రణబీర్ కపూర్ అవుతాడని అంటున్నారు. తోటి నటులతో రణబీర్ ను పోల్చడం తప్పవుతుందని, అతడికి పరిమితుల్లేవని, రణబీర్ ది వేరే లెవెల్ అని అన్నారు.

యానిమల్ సినిమాతో రణబీర్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు వంగ. రాక్ స్టార్ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యానని, ఒకే రోజు రెండు సార్లు ఆ సినిమాను చూసి తృప్తి పొందానని అన్నాడు సందీప్. అతడితో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని, యానిమల్ తో ఆ కోరిక నెరవేరిందన్నారు.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు సందీప్ రెడ్డి. యానిమల్ సినిమాలో హీరో చాలా కోపంగా ఉంటాడు. రణబీర్ కు మాత్రం నిజజీవితంలో అస్సలు కోపం రాదంట. దీంతో సీన్ రాస్తున్న ప్రతిసారి, కోపం వస్తుందా అని రణబీర్ ను పదేపదే అడిగేవాడంట సందీప్. తనకు కోపం రాదని, ఇదే ప్రశ్నను ఇప్పటికే 7-8 సార్లు అడిగారని రణబీర్ గుర్తుచేసేవాడంట.

అలాంటి సౌమ్యుడు, యానిమల్ సినిమాలో కోపం ప్రదర్శిస్తుంటే షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. రణబీర్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన గ్లింప్స్ చూసి మాఫియా బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తుందని అంతా అనుకున్నారు. 

కానీ తాజాగా వచ్చిన ట్రయిలర్ లో భిన్న మనస్తత్వాలు కలిగిన తండ్రికొడుకుల భావోద్వేగాలతో యానిమల్ సినిమా తెరకెక్కిందనే విషయం అర్థమౌతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను హిందీతో పాటు, సౌత్ భాషల్లో డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.