బాలయ్య.. అంత వీజీ కాదు..!

ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.

ఒకటి చెప్పి ఒకటి చేస్తాం అంటే నందమూరి బాలకృష్ణ దగ్గర నడవదు. చెప్పినపుడే క్లారిటీగా చెప్పేయాలి. ఏదో ఒకటి చెప్పి ఒప్పించేసి, తరువాత అలా కాదు బాబు.. ఇలా కాదు బాబు అని చెప్పి మార్చేయచ్చు అనుకుంటే అక్కడ కుదరదు గాక కుదరదు. బోయపాటి- అఖండ 2 సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వ్యవహారాలు వింటుంటే.. ఇవన్నీ చెప్పాల్సి వస్తోంది.

అఖండ 2 సినిమాలో ప్రగ్య జైస్వాల్ వుండాలి లెక్క ప్రకారం. తొలి భాగంలో ఆమె వుంది. అందువల్ల మలి భాగంలో తప్పని సరి. కానీ ఆమె చాలా ఎక్కువ రెమ్యూనిరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. బేరం తెగలేదు. దాంతో డైరక్టర్ బోయపాటికి కాస్త మండుకొచ్చింది. అసలు ఆమె పాత్ర ఎందుకు అని, చనిపోయినట్లు కథ మార్చేసారు. సినిమాలో మరో పాత్రను క్రియేట్ చేసి సంయుక్త మీనన్‌ను తీసుకున్నారు.

అయితే ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా. అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్‌ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది. ఏం మిస్ అయిందో తెలుసునా అంటూ ప్రశ్నించి, వారంతా తెల్ల మొహం వేసాక అప్పుడు చెప్పారట. చనిపోయిన సీన్ తీస్తున్నారు కదా, మరి చనిపోయిన మనిషి ఫొటొ ఎక్కడ అని. ప్రగ్య జైస్వాల్ ఫొటో వాడడం ఇష్ఠం లేని బోయపాటి సీన్‌లో ఫొటో పెట్టలేదు. బాలయ్య సీన్ కు అది అవసరం అని గుర్తు చేసి, తన స్టయిల్ లో నాలుగు తిట్లు తిట్టి, ఫొటో తెప్పించి పెట్టారట.

ఇదిలా వుంటే సినిమా ఆరంభంలో సంజయ్ దత్ ను సినిమాలో కీలక పాత్రకు తీసుకుంటున్నాం అని చెప్పారట. కానీ తరువాత ఎందుకో మళ్లీ బోయపాటి మనసు మార్చుకున్నారు. కానీ బాలయ్య దగ్గర అలా కుదరదు కదా. బోయపాటిని పిలిచి నిలదీసినట్లు తెలుస్తోంది. డేట్ లు.. అవీ ఇవీ.. అని నీళ్లు నములుతుంటే, తానే ఫోన్ తీసుకుని సంజయ్ దత్ తో మాట్లాడి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి బాలయ్యతో వ్యవహారం అంటే అంత ఈజీగా వుండదు.

8 Replies to “బాలయ్య.. అంత వీజీ కాదు..!”

Comments are closed.