న్యూయర్ తొలి రోజు.. స్టార్ హీరో కూతుర్లదే!

2017 తొలి రోజును చాలా గ్రాండ్ గా ఆరంభించారు రజనీకాంత్ తనయలు ఐశ్వర్య, సౌందర్యలు. దర్శకులుగా తమ తమ సినిమాలకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేసి.. చాలా ఉత్సాహవంతంగా నూతన సంవత్సరాన్ని ఆరంభించారు…

2017 తొలి రోజును చాలా గ్రాండ్ గా ఆరంభించారు రజనీకాంత్ తనయలు ఐశ్వర్య, సౌందర్యలు. దర్శకులుగా తమ తమ సినిమాలకు సంబంధించిన లుక్స్ ను విడుదల చేసి.. చాలా ఉత్సాహవంతంగా నూతన సంవత్సరాన్ని ఆరంభించారు ఈ అక్కాచెల్లెల్లు. 

బావ ధనుష్ హీరోగా “వీఐపీ-2’’ ను రూపొందిస్తున్న సౌందర్య.. నూతన సంవత్సరం సందర్భంగా ఆ సినిమా లుక్ ను విడుదల చేసింది. అందులో ధనుష్- కాజోల్ లు ఆ లుక్ లో హైలెట్ అవుతున్నారు. ఎలాగూ సూపర్ హిట్టైన వీఐపీ సినిమాకు సీక్వెల్ కాబట్టి.. ఆ సినిమా తాజా అప్ డేట్ పై అందరి ఆసక్తి నెలకొని ఉంది.

ఇక దేశం మొత్తాన్నీ ఆకర్షించింది ఐశ్వర్య ఆర్ ధనుష్. పారా ఒలింపిక్స్ లో స్వర్ణం ఒడిసి పట్టిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది ఐశ్వర్య. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. భారతదేశం గర్వించదగ్గ ఒక అథ్లెట్ కథ కాబట్టి.. మరియప్పన్ ఫస్ట్ లుక్ పై గొప్ప స్పందన వ్యక్తం అవుతోంది.

ఇది వరకూ చాలామంది క్రీడాకారుల జీవితాలపై సినిమాలు వచ్చాయి.. అయితే మరియప్పన్ కథ కచ్చితంగా చాలా ప్రత్యేకమైనదే. ఇది వరకూ సెల్వ రాఘవ వద్ద అసిస్టెంట్ గా పని చేసి, సొంతంగా దర్శకురాలిగా ‘త్రీ’ వంటి సినిమాను రూపొందించిన ఐశ్వర్య.. తాజా సినిమాకు సంబంధించిన అప్ డేట్ తో న్యూ యర్ ఫస్ట్ డేని గ్రాండ్ గా ఆరంభించింది.

ఓవరాల్ గా.. రజనీ కూతుళ్లిద్దరూ ఫస్ట్ డే.. ఫస్ట్ లుక్స్ తో అదరగొట్టేశారు!