ఉపాధ్యాయ సంఘాల‌తో చ‌ర్చ‌ల్లేకుండా.. ఏకంగా నిర్ణ‌యాలే!

ఉపాధ్యాయులు, ఉద్యోగుల్ని ఎప్పుడూ త‌మ వైపే వుంటే అధికారానికి ఇబ్బంది వుండ‌ద‌ని కూట‌మి ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న వుండ‌డం లేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్ర‌తి విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు.…

ఉపాధ్యాయులు, ఉద్యోగుల్ని ఎప్పుడూ త‌మ వైపే వుంటే అధికారానికి ఇబ్బంది వుండ‌ద‌ని కూట‌మి ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న వుండ‌డం లేదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్ర‌తి విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తుంటారు. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డంపై కంటే, ఇత‌రేతర విష‌యాల‌పై వారికి ఆసక్తులు ఎక్కువ‌నే భావ‌న స‌మాజంలో వుంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇటీవ‌ల మండ‌లిలోనూ, వెలుప‌ల మాట్లాడుతూ ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. లోకేశ్ మాట‌లకు ముఖ్యంగా ఉపాధ్యాయులు ఖుషీ అయ్యారు. అయితే లోకేశ్ త‌న మాట‌పై నిల‌బ‌డ‌లేద‌ని అప్పుడే ఉపాధ్యాయులు మండిప‌డుతున్నారు. ఇందుకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం “చ‌ర్చ‌లు అన్నారు.. ఏకంగా నిర్ణ‌యాలే తీసుకున్నారు” శీర్షిక‌తో ప్ర‌చారం చేస్తున్న సోష‌ల్ మీడియా పోస్టే నిద‌ర్శ‌నం.

“వందరోజుల పాటు కసరత్తు చేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రోడ్డు మ్యాప్ వేస్తామన్నారు. మరి ఈ రోజు సంఘాలను పరిగణలోకి తీసుకోకుండానే పాలనాపరమైన, నిర్వహణ పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత ఆరు నెలలుగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చెందారు. పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఏర్పడింది వాస్తవమే!

దానికి ఏం చేయాలి ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులను తీసేసి డెప్యూటేషన్ మీద ఉన్నత పాఠశాలలో నియమిస్తే సరిపోతుందా? మరి! ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఏంటి వాటి స్థాయి తగ్గించడం కాదా? పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఉన్నపళంగా మూసివేస్తే రేపు ఆ ఊరికి బడి దూరం చేసినట్లు కాదా?

గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో మూసివేసిన పాఠశాలల సంఖ్య ఎంత? ఇప్పుడు పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల సంఖ్య ఎంత? ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు డీఎస్సీ నిర్వహించి సంవత్సరం తర్వాత ఆ ఊరికి ఉపాధ్యాయుని నియమిస్తామంటే.. ఒకసారి బడి మూత వేసిన తర్వాత విద్యార్థులు ఇంకో చోటికి వలస వెళ్లాక‌ తిరిగి పాఠశాల జీవం పోసుకోవడం చాలా కష్టం.

ఒక బడిని పాడు చేసి ఇంకొక బడిని బాగుపరుస్తామంటే దాన్ని ఎవరు హర్షించరు. అయినా సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయాలని సాక్షాత్తు మంత్రి గారు చెప్పారు. మరి సంఘాలతో చర్చించకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు చేసుకుంటున్నారు. ఇది మంచి విధానం కాదు.

ఉపాధ్యాయులకు యాప్‌ల‌ బారం , ఆన్ లైన్ తలనొప్పి తగ్గిస్తామన్నారు! రోజు రోజుకూ పెరగడమే తప్ప తగ్గడమే లేదు. మార్పున‌కు సమయం ఎప్పుడు?”

ఇట్లుంది క్షేత్ర‌స్థాయిలో ఉపాధ్యాయ సంఘం ఆవేద‌న‌, ఆగ్ర‌హం. ప్ర‌భుత్వాన్ని మార్చుకున్నంత మాత్రాన త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌నే ఉపాధ్యాయుల్లో న‌మ్మ‌కం పోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

4 Replies to “ఉపాధ్యాయ సంఘాల‌తో చ‌ర్చ‌ల్లేకుండా.. ఏకంగా నిర్ణ‌యాలే!”

  1. రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడడానికి మీరు ఉన్నారు కదా.

Comments are closed.