అమ్మ ఒడిపై రాజకీయం.. జనాలు నమ్మరు గురూ!

జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పథకం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది, పూర్తిగా జగన్ ఆలోచన నుంచి వచ్చింది. దీంతో అమ్మఒడిపై ఎలాగైనా రాజకీయం…

జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పథకం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది, పూర్తిగా జగన్ ఆలోచన నుంచి వచ్చింది. దీంతో అమ్మఒడిపై ఎలాగైనా రాజకీయం చేయాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు. 

ఇద్దరు పిల్లలుంటే ఒకరికే అమ్మఒడి ఇస్తారా అంటూ గతంలో రాద్ధాంతం చేశాయి. తాజాగా అమ్మఒడికి అటెండెన్స్ కి లింకేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందంటూ దత్తపుత్రుడు నానా యాగీ చేస్తున్నారు. 

అమ్మఒడి ఇవ్వకుండా తప్పించుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే కొత్త రూల్స్ తీసుకొచ్చారని అంటున్నారు పవన్ కల్యాణ్. కరెంటు వాడకానికి అమ్మఒడికీ సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు.

దత్తపుత్రుడే ఆ రేంజ్ లో ఫైర్ అయితే సొంత పుత్రుడు ఊరుకుంటారా. నారా లోకేష్ కూడా అమ్మఒడిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడిని అర్థఒడిగా మార్చారంటూ ప్రాస కలిపారు. మరుగుదొడ్ల నిర్వహణకు అమ్మఒడి డబ్బుల్ని కట్ చేస్తున్నారని ఆరోపించారు లోకేష్. అర్హులందరికీ అమ్మఒడి ఇవ్వాలనేది చినబాబు డిమాండ్.

అసలు నిజమేంటి..?

అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకూ 44లక్షల మంది తల్లులు లబ్ధిదారులుగా ఉన్నారు. తాజాగా వారి సంఖ్య మరో 2లక్షలు పెరిగింది. అంటే అమ్మఒడి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టా, ముందుకు పోయినట్టా..? 

నిధులు మిగుల్చుకున్నట్టా, ఉదారంగా ఆర్థిక సాయం చేస్తున్నట్టా..? ఈ లెక్కలు చూస్తే తేలిపోయే విషయానికి ఇంత రాద్ధాంతమెదుకు..? విద్యార్థులు మధ్యలో బడి మానేయకుండా ఉండేందుకే అమ్మఒడికి అటెండెన్స్ తో ముడిపెట్టామని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఎప్పటికి తెలుసుకుంటారు..?

ప్రభుత్వం నిజంగానే డబ్బులు మిగుల్చుకోవాలనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ కి అమ్మఒడి కట్ అని చెప్పేసేది. కానీ అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోటే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది, జగన్ అనుకున్నట్టుగానే దీన్ని అమలు చేస్తున్నారు. 

అమ్మఒడి ఆర్థిక భారం అయినా కొనసాగిస్తున్నారు. డబ్బులు వృథా కాకూడదనే ఉద్దేశంతోటే.. పెద్ద తరగతుల పిల్లలకు ఆర్థిక సాయం స్థానంలో ల్యాప్ టాప్ లు ఇవ్వబోతున్నారు. దీనిపై కూడా బురద జల్లాలనుకోవడం ప్రతిపక్షాల అవివేకం.

ఓవైపు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది అని ప్రభుత్వం గణాంకాలతో సహా వివరిస్తుంటే.. కరెంటు బిల్లులు, అటెండెన్స్ లు అంటూ ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోంది. అసలు అమ్మఒడి లాంటి ఓ పథకం గురించి కనీసం ఆలోచనే చేయలేకపోయారు చంద్రబాబు.. మరి అలాంటి పథకంపై లోకేష్ విమర్శలు చేయడం, పథకాన్ని అందరికీ అమలు చేయాలని ఉచిత సలహాలివ్వడం  కామెడీ కాక ఇంకేంటి..?